– మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శ
హైదరాబాద్, మహానాడు: ఇతరుల ఘనతను తమ ఘనతగా చెప్పుకునేవాళ్లను పరాన్నజీవులు అంటారు. కాంగ్రెస్ నాయకుల, ప్రభుత్వం తీరు అలాగే ఉందన్న సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. సీతారామ ప్రాజెక్టుపై మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవనంలో విలేకర్లతో మాట్లాడారు. ఆ వివరాలివి. సీతారామ ప్రాజెక్టు ప్రారంభ సన్నాహక సమావేశాల్లో భాగంగా కాంగ్రెస్ మంత్రులు నెత్తి మీద నీళ్ళు చల్లుకుంటున్నారు. మంత్రులు ఈ ప్రాజెక్టు కోసం క్రెడిట్ తీసుకునేందుకు మంత్రులు పోటీ పడుతున్నారు. ఈ నెల 15 న సీఎం రేవంత్ క్రెడిట్ తీసుకునేందుకు ఇంకో ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ సీతారామ ప్రాజెక్టు ను తనకూ ఇష్టమైన పనిగా మొదలు పెట్టారు. ప్రాజెక్టుకు ఎలాంటి అడ్డంకులు ఉండకూడదని కేసీఆర్ సీతారామ ప్రాజెక్టుగా నామకరణం చేశారు. ప్రభుత్వం మారడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి రిబ్బన్ కటింగ్ చేసే అవకాశం వచ్చింది.
సీతారామ ప్రాజెక్టును అడ్డుకోడానికి కాంగ్రెస్ కోర్టులో కేసులు వేసినా బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని కష్టాలు అధిగమించి పట్టుదలతో పూర్తి చేసింది. ఈ రోజు మీకు రిబ్బన్ కటింగ్ చేసే అవకాశం వచ్చింది కాబట్టి ప్రాజెక్ట్ కట్టినట్టి కటింగ్ ఇస్తున్నారు. ఇతరుల ఘతనను తమ ఘనతగా చెప్పుకునేవాళ్లను పరాన్నజీవులు అంటారు. కాంగ్రెస్ నాయకుల, ప్రభుత్వం తీరు అలాగే ఉంది. 75 కోట్లకే లక్షన్నర ఎకరాలకు నీళ్లు ఇచ్చామంటే నోబెల్ ప్రైజుకు ఇవ్వాలి. మీరు ప్రారంభించిన మూడు పంపు హౌసు పనుల్లో పది పైసల పనన్నా మీరు చేశారా? ప్రాజక్టు కట్టాలంటే డిజైన్, భూముల సేకరణ, అనుమతులకు ఏళ్లు పడుతుంది. మీరు ఏడు నెలల్లోనే పూర్తి చేశారా? ప్రాజెక్టు దగ్గరికి రోజూ ఒక మంత్రి వెళ్తున్నారు. ఖమ్మం జిల్లాలో మంత్రులు పోటీ పడుతున్నారు. జనం మిమ్మల్ని చూసి నవ్వుకుంటున్నారు.
30 వేల ఉద్యోగాల తీరులాగే ఉన్నది సీతారామ ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం తీరు. మా ప్రభుత్వం ఈ ప్రాజెక్టును 95 శాతం పూర్తిచేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్, పరీక్షలు అన్నీ పూర్తి చేసి నియామకాల దగ్గరే ఆగిపోయింది. కాంగ్రెస్ నియామాకాలు చేసి తన ఘనతగా చెప్పుకుంటోంది. మేం నిర్మించిన ఫ్లైఓవర్లను, ప్రాజెక్టులను ప్రారంభిస్తూ, మేం తెచ్చిన బస్సులకు జెండాలుపుతూ, మేం అమలు చేసిన పథకాలకు చెక్కులు పంచుతూ కాలం గడపుతున్నారు. కేసీఆర్ ఆనవాలు చెరిపేస్తామని అంటున్నారు. మీ తండ్లాట, మీ తాపత్రయమే నీ నైతిక పతకానికి సంకేతం. సీతారామ ప్రాజెక్టు క్రెడిట్ కేసీఆర్దే అని చెప్పిన మంత్రి తుమ్మల ఇప్పుడు అదే మాట గుండెలపైనే చెయ్యేసుకుని చెప్పాలి. సీతారామ ప్రాజెక్టు కేసీఆర్ కల. కృష్ణా నీళ్లు రాకపోవడంతో గోదావరి నీళ్లను ఒడిసిపట్టి ఖమ్మం జిల్లాను మొత్తం రెండు పంటలతో సస్యశ్యామలం చేయాలనుకున్నారు. రాజీవ్, ఇందిరా సాగర్లలో మీరు మూడు వేల సామర్థ్యం పెట్టగా కేసీఆర్ తొమ్మిది వేల క్యూసెక్కులకు పెంచారు. వందేళ్ల భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకున్నారు. ఇప్పుడు మీరు ఈ ప్రాజెక్టును మేం కట్టామంటున్నారు.
ప్రాజెక్ట్ మెయిన్ కెనాల్లో ఎనిమిది ప్యాకేజీల్లో అయిదు మేం పూర్తిచేశాం. మిగతా మూడింటిలో 80 శాతం పని పూర్తయిం. మోటార్లు, పంప్ హౌసుల నిర్మాణం బీఆర్ఎస్ హయాంలో జరిగిందే. మీరు నెత్తిమీద నీళ్లు చల్లుకుని పాపపరిహారం చేసుకుంటున్నారు. ప్రాజెక్టు పేరే సీతారామ ప్రాజెక్టు.. రాముడు సత్యవాక్పరిపాలకుడు. సత్యానికి, ధర్మానికి ప్రతిరూం. ఆయన పేరుపై కట్టిన ప్రాజెక్టు అబద్దాలు చెప్తే ఆ భగవంతుడు కూడా క్షమించడు. ఇతరుల ఘనతను మీదిగా చెప్పుకునే భావదారిద్య్రం నుంచి మీరు బయటపడాలి. పేరు కోసం ఇంత దిగజారాలా? మీరు 2005 నుంచి 2014వరకు మీరు తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టుకు కనీసం అనుమతులు కూడా తీసుకురాలేదు. భట్టివిక్రమార్క అప్పుడు కూడా కేబినెట్ హోదాలో ఉన్నారు. ప్రాజెక్టును మేం రైతుల అవసరాల కోసం రీడిజైన్ చేసుకుని ఆయకట్టును 3 లక్షల ఎకరాల నుంచి 6 లక్షల 74వేల ఎకరాలకు పెంచాం. ఇప్పటికైనా పబ్లిసిటీ స్టంట్స్ మాని సంక్షేమంపై దృష్టి పెట్టండి.