-తెలంగాణ ప్రజల ఆగ్రహానికి బలికాక తప్పదు
-కాంగ్రెస్తో బీజేపీ కుమ్మక్కై మాట్లాడటం లేదు
-రాజముద్ర తొలగింపుపై ఓవైసీ స్పందించాలి
-బీఆర్ఎస్ నేత జి.దేవీప్రసాద్
హైదరాబాద్: కేసీఆర్ హయాంలో పదేళ్ల పాటు జరిగిన అభివృద్ధిని కాంగ్రెస్ విధ్వంసంగా చూపెట్టే ప్రయత్నం చేస్తోంది…కేసీఆర్ ఆనవాళ్లను కాంగ్రెస్ చెరిపేసే ప్రయత్నం చేస్తే ఉద్యమ ఆగ్రహానికి బలికాక తప్పుదని బీఆర్ఎస్ నేత జి.దేవీ ప్రసాద్ హెచ్చరించారు. తెలంగాణ భవన్లో గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దశాబ్ది ఉత్సవాలు జూన్ 1,2,3 తేదీల్లో ఘనంగా జరపాలని నిర్ణయించాం. జూన్ 1 సాయంత్రం పబ్లిక్ గార్డెన్స్ నుంచి జరిగే క్యాండిల్ ర్యాలీ లో పెద్ద ఎత్తున పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం. హత్యలు చేసిన వాళ్లే సంతాప సభలు పెట్టినట్టు ఉంది కాంగ్రెస్ తీరు. గన్ పార్కులో ఉన్న అమరవీరుల స్థూపం కాంగ్రెస్ దమన కాండని ప్రతిక్షణం గుర్తు చేస్తుందని మండిపడ్డారు.
కొత్త చిహ్నాలతో తెలంగాణ చరిత్రను కాంగ్రెస్ మాయం చేయాలని చూస్తోంది. చార్మినా ర్, కాకతీయ కళాతోరణంల గురించి కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియదు. కచ్చితంగా ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలపై పోరాడతామని తెలిపారు. గెల్లు శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ చార్మినార్ను రాజముద్ర నుంచి తీసేస్తే బీజేపీ మాట్లాడటం లేదు..అంటే కుమ్మక్కయ్యారా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్రెడ్డి తెలంగాణ ద్రోహుల కుట్రలను అమలు చేస్తున్నారు. కోదండరాం పక్కన ఉండి రేవంత్ చర్యలను సమర్ధించడం విడ్డూరం. ఓవైసీ కూడా చార్మినార్ ను రాజముద్ర నుంచి తొలగించడంపై స్పందించాలని కోరారు. సమావేశంలో నోముల భగత్, రూప్ సింగ్, గోసుల శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.