ఆటోనగర్‌ అభివృద్ధికి సహకారం

-గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌
-తెనాలి ఆటోనగర్‌ అసోసియేషన్‌ సమావేశం

గుంటూరు, మహానాడు: తెనాలి ఆటోనగర్‌లో వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, అవినీతిని తగ్గించే ప్రయత్నం చేస్తామని గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ తెలిపారు. తెనాలి ఆటోనగర్‌ అసోసియేషన్‌ హాలులో గురువారం జరిగిన సమావేశానికి నాదెండ్ల మనోహర్‌తో కలిసి పెమ్మసాని ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ అమెరికా నుంచి ఆంధ్రాకు అయిన త్వరగా రావచ్చేమో…విజయవాడ నుంచి తెనాలికి మాత్రం రాలేమన్నారు. గోతులతో నిండిన ఈ రోడ్లపై ప్రయాణించాలంటే ప్రాణాంతకంగా ఉందని ప్రభుత్వ తీరును ఆయన విమర్శించారు. రోడ్లు, నీళ్లు వంటి కనీస సౌకర్యాలకు బదులు ఓట్లు కొనుక్కోవాలనే దుష్ట ఆలోచనలో ఈ జగన్‌ ప్రభుత్వం ఉందన్నారు. లారీ డ్రైవర్ల నుంచి పన్నుల రూపేణా గతం కంటే 200 శాతం ఎక్కువగా ఈ ప్రభుత్వం సామాన్యుల నుంచి వసూలు చేస్తుందని తెలిపారు. టీడీపీ అధికారంలోకి రాగానే మైక్రో రుణాలు, అసోసియేషన్‌ సమస్యల పరిష్కారాలకు కృషి చేస్తామని స్పష్టం చేశారు.

తెనాలి నియోజకవర్గ అసెంబ్లీ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌ మాట్లాడుతూ ఈ ఆటోనగర్‌ ద్వారా 4 వేల మందికి ఉపాధి దొరుకుతుందని చెప్పారు. ఆటోనగర్లో కష్టపడే వారికి సహకరిస్తున్న సభ్యులకు అభినందనలు తెలిపారు. తాను ప్రజా ప్రతినిధిగా ఉన్న సమయంలో సోలార్‌ ప్లాంట్‌, పెదరావూరు – నందివెలుగు నాలుగు లైన్ల రహదారి తదితర ప్రతిపాదనలు, కేటాయింపులు చేశానని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లోనూ ఉన్నతమైన ఆలోచనలతో తాను, పెమ్మసాని కలిసి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని, తమను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్‌ చైర్మన్‌ చుక్కపల్లి శివ నాగేశ్వరరావు, జనసేన నాయకులు తోటకూర వెంకటరమణ, తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు అన్నాబత్తుని జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.