సీఎస్‌, ఆయన కుమారుడిపై సీబీఐ విచారణ జరిపించాలి

-భూబాగోతాలపై ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటు చేస్తాం
-టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి.ప్రణవ్‌గోపాల్‌

మంగళగిరి:నెలరోజుల్లో పదవీ విరమణ చేయనున్న సీఎస్‌ జవహర్‌ రెడ్డి విశాఖ పరిధిలో రూ.2 వేల కోట్ల విలువైన 800 ఎకరాల అసైన్డ్‌ భూములు కుంభకోణానికి పాల్పడ్డారని, ఆయనతో పాటు కుమారుడిపై కేంద్ర ప్రభుత్వం స్పందించి సీబీఐ విచారణ జరిపించాలని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి.ప్రణవ్‌ గోపాల్‌ డిమాండ్‌ చేశారు. దొంగలు, దొంగలు ఊర్లు పంచుకున్నట్లుగా జగన్‌ రెడ్డి గ్యాంగ్‌ ఉత్తరాంధ్రలో పేదలు, దళితుల అసైన్డ్‌ భూములను దోచుకుని పంచుకుంటున్నారు. జీవో 596 విడుదలైనప్పటి నుంచి ఇప్పటివరకు అన్ని లావాదేవీలపై విచారణ చేయించాలని కోరారు. విశాఖలో ఇప్పటికే జగన్‌రెడ్డి అండ్‌ కో రూ.40 వేల కోట్ల విలువైన భూములను కాజేశారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భూ బాగోతాలపై ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటు చేసి విచారణ చేయిస్తామని తెలిపారు.