Mahanaadu-Logo-PNG-Large

అత్యంత వైభవంగా తెలంగాణ అవతరణ ఉత్సవాలు

-గన్‌పార్క్‌ అమరుల స్థూపం, పరేడ్‌ గ్రౌండ్‌లో ఏర్పాట్లు
-ట్యాంక్‌ బండ్‌పై కార్నివాల్‌, లేజర్‌ షోలు, వినోదశాలలు
-జూన్‌ 2న ఏర్పాట్లకు అధికారులు తగిన చర్యలు చేపట్టాలి
-రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశం

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలను జూన్‌ 2న అత్యంత వైభవం గా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. ఆ రోజు ఉదయం గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ రాష్ట్ర సాధన అమరులకు ముఖ్యమంత్రి నివాళులు అర్పించిన అనంతరం సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.

రాష్ట్ర అవతరణ దినోత్సవ ఏర్పాట్లపై సోమవారం సచివాలయంలో వివిధ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. డీజీపీ రవీ గుప్తా, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు దాన కిషోర్‌, శైలజా రామయ్యర్‌, శ్రీనివాసరాజు, జీఏడీ కార్యదర్శి రఘునందన్‌రావు తదితరులు హాజరయ్యారు. పరేడ్‌ గ్రౌండ్‌లో ఉదయం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించ డంతో పాటు సందేశం ఉంటుందని తెలిపారు.

ట్యాంక్‌ బండ్‌పై కార్యక్రమాలు
సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్యాంక్‌ బండ్‌పై రాష్ట్రం లోని అన్ని కళారూపాలతో పెద్ద ఎత్తున కార్నివాల్‌ నిర్వహించనున్నట్టు తెలిపారు. దీంతో పాటు శిక్షణ పొందుతున్న 5000 మంది పోలీస్‌ అధికారులు బ్యాండ్‌తో ఈ ప్రదర్శనలో పాల్గొంటారని వివరించారు. ట్యాంక్‌ బండ్‌పై దాదాపు 80 స్టాళ్లను ఏర్పాటు చేసి హస్త కళలు, చేనేత, స్వయం సహాయక బృందాలతో తయారు చేసిన పలు వస్తువులతో పాటు నగరంలోని పేరొందిన హోటళ్ల ఫుడ్‌ స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. హాజరయ్యే నగర పౌరులతో వచ్చే పిల్లలకు పలు క్రీడలతో కూడిన వినోద శాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ట్యాంక్‌బండ్‌పై పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశమున్నందున వారికి ఏ విధమైన ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

ట్యాంక్‌ బండ్‌పై సాంస్కృతిక ప్రదర్శనల అనంతరం ఆకర్షణీయమైన బాణసంచా ప్రదర్శన తో పాటు లేజర్‌షో ఏర్పాటు చేశామని వివరించారు. రాష్ట్ర అవతరణ సందర్బంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్‌ దీపాలతో అలంకరించాలని తెలిపారు. ఈ సమీక్షలో అడిషనల్‌ డీజీలు సంజయ్‌కుమార్‌ జైన్‌, ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌, నగర పోలీస్‌ అడిషనల కమిషనర్‌, సమాచార శాఖ స్పెషల్‌ కమిషనర్‌ హనుమం తరావు, ఎన్‌పీడీసీఎల్‌ ఎండీ ముష్రాఫ్‌, హెచ్‌ఎండీఏ అడిషనల్‌ కమిషనర్‌ ఆమ్రపాలి కాటా పాల్గొన్నారు.