సాహితీరంగంలో అక్షర యోధుడు దాశరథి 

– మంత్రి కొండా సురేఖ 

హైదరాబాద్, మహానాడు :  తెలంగాణ సాహితీరంగంలో అక్షర యోధుడు దాశరథి కృష్ణమాచార్యులు అని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి కొండా సురేఖ  అన్నారు. తెలంగాణ సాహితీయోధుడు దాశరథి కృష్ణమాచార్యుల శత జయంతి (జూలై 22)ని పురస్కరించుకుని సాహితీ రంగానికి దాశరథి అందించిన సేవలను స్మరించుకున్నారు.

ఈ సందర్బంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ.. పదునైన అక్షరాలను ఆయుధాలుగా మలిచి అణచివేతకు వ్యతిరేకంగా దాశరథి పూరించిన శంఖారావం తర్వాతి కాలంలో తెలంగాణ సాధన దిశగా యావత్ తెలంగాణను ప్రేరేపించిందని అన్నారు. స్వేచ్ఛ, స్వరాజ్యం కోసం దాశరథి కృష్ణమాచార్యులు అహరహం అంతలా పరితపించారని మంత్రి అన్నారు.

దాశరథి స్ఫూర్తితో అన్ని వర్గాల ప్రజలు తెలంగాణ కోసం ఉద్యమించి స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసుకున్నారన్నారు. సామాజిక సమస్యలపై అనునిత్యం పోరాటం సాగించిన దాశరథి తరతరాలకు ఆదర్శప్రాయుడని మంత్రి సురేఖ తెలిపారు.  దాశరథి ఆశయాల మేరకు కరువు కాటకాలు, అనాథలు, అన్నార్థులు లేని తెలంగాణ సాధనకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అంకితభావంతో కృషి చేస్తుందని మంత్రి సురేఖ తెలిపారు. ఈ యేడు దాశరథి సాహితీ పురస్కారానికి ఎంపికైన మట్టికవి జూకంటి జగన్నాథానికి  మంత్రి సురేఖ శుభాకాంక్షలు తెలిపారు.