ధర్మరాజు ఏ తప్పు చేయలేదా?

పాండవులు స్వర్గారోహణ కి సశరీరంగా వెళ్ళే క్రమంలో ఒక్కొక్కరుగా పడిపోతూ ఉంటే భీముడు ధర్మరాజుని ప్రశ్నిస్తాడు. ముందుగా ద్రౌపతి పడిపోతుంది, భీముడు చూసి ద్రౌపది ఏ పాపం చేయలేదు యోగబలం ఎందుచేత తగ్గి పడిపోయింది? అని అడిగాడు. అప్పుడు యుధిష్ఠిరుడు, ఈవిడ పతులలో అర్జునుడి పట్ల పక్షపాత బుద్ది కలిగి ఉంది.

5గురు భర్తలపై సమబుద్ది రాలేదు. దాని ఫలమే ఇది. తర్వాత సహదేవుడు పడిపోయాడు? భీముడు మళ్ళీ ప్రశ్నించాడు సహదేవుడు ఎందుకు పడిపోయాడు? సహదేవుడికి నాతో సరితూగే తెలివైన వాడు లేడు అనే భావన చేత పడిపోయాడు. నకులుడు పడిపోయాడు. నకులుడు ఎందుకు పడిపోయాడు? ఇతడెప్పుడు ధర్మమార్గాన్ని తప్పలేదు. అని అడిగాడు. నా అంత అందగాడు లేడు ఈ ప్రపంచంలో అనుకుంటాడు. అందువల్ల పడిపోయాడు.

కొంత దూరం వెళ్ళేసరికి అర్జునుడు పడిపోయాడు. భీముడు ఖిన్నుడై అర్జునుడు ఎందుకు పడిపోయాడు? అంటే అర్జునుడు ముందు వెనుక చూడకుండా ఒక ప్రతిజ్ఞ చేశాడు.

1 రోజులో శత్రువులతో పాటు 11అక్షౌహిణుల సన్యాన్ని దగ్ధం చేస్తానన్నాడు చేయలేకపోయాడు.అంతేకాదు నన్ను మించిన శూరుడు లేడనే అహంకారం ఉన్నది. అప్పుడప్పుడు ధనుర్ధారులని అవమానించాడు.శ్రేయఃకాముడు అయినవాడు ఇలా చేయకూడదు కదా అందుకు పడిపోయాడు.

ఆ తరువాత అయ్యో నేను పడిపోతున్నాను,నేనెందుకు పడిపోతున్నాడు చెప్పమని అడిగాడు. నువ్వు భోజన విషయంలో నియమం పాటించవు. అంతేకాదు నువ్వు కూడా అవతలి వాడు ఎలాంటి వాడు అని చూడకుండా నీ బలాన్ని చూసి గర్విస్తావ్,అందుకు నువ్వు పడిపోతున్నావ్. పక్షపాతం, బలగర్వం, సౌందర్య గర్వం, తెలివితేటల గర్వం, శౌర్య గర్వం, ఇలా ఏ ఒక్క లోపం ఉన్నా యోగబలాన్ని దెబ్బతీస్తుంది. తపశ్శక్తినీ పాడుచేస్తుంది. ఆఖరికి ధర్మరాజు ఒక్కడు మిగిలాడు,ఆయనతో వచ్చిన కుక్క మిగిలింది. కుక్కతో ప్రారంభమైన భారతం, కుక్కని స్వర్గానికి తీసుకెళ్ళడంతో ముగుస్తుంది.

ధర్మరాజు ఏ తప్పు చేయలేదా అనేకదా సందేహం? ద్రోణ పర్వంలో ద్రోణ వధ కోసం శ్రీకృష్ణుడు అశ్వద్ధామ హతః అనమని మాత్రమే చెప్తే, అబద్ధం అనుకొని చెప్పడానికి సంకోచిస్తాడు.

ఇంతలో భీముడు అశ్వద్ధామ అనే గజాన్ని ఇందాకే చంపాను కాబట్టి భయపడకు అన్నయ్యఅని చెబితే, అశ్వద్ధామ హతఃఅని కుంజరః అని చిన్నగా అంటాడు, శ్రీకృష్ణుడు కూడా ఆశ్చర్యపోతాడు.

దీనివల్ల అప్పటివరకు భూమికి 4అంగుళాల ఎత్తులో ఉన్న ధర్మరాజు రథం కుంజరః అనగానే భూమిని తాకుతుంది. ఎందుకంటే శ్రీకృష్ణుడు “అశ్వద్ధామ హతః” అని మాత్రమే చెప్పారు. సొంత పైత్యం వాడే సరికి యోగశక్తి కాస్త తగ్గి రథం భూమి మీదకి వచ్చేసింది.

కుంజరః అనే దోషం వల్ల అంటే కపటం వల్ల కపట నరకం చూడల్సి వచ్చింది. అందులో ద్రౌపతి, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు ఆర్తనాదాలు చేస్తూ ఉండటం చూసి నివ్వెరపోయి బాధపడతారు.

అది చూసిన ఇంద్రుడు ధర్మరాజా బాధపడకు నువ్వు ద్రోణుడి వద్ద కపటంతో అన్న మాటకి, కపట నరకం చూశావ్దానికి ఇది చెల్లు. కావాలంటే చూడు అని చెబితే అంతవరకు కనిపించిన నరకం మాయమై దేదీప్యమానంగా వెలిగిపోతున్న స్వర్గం దర్శనం ఇచ్చింది.

చిన్న మాటకి నరకం చూడాల్సి వచ్చింది,ద్రౌపతి, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులుకి ఉన్న కొద్దిపాటి అహంకారం శరీరంతో స్వర్గాన్ని చేరుకునే యోగశక్తిని భ్రష్టం చేసింది.
ఈ లెక్కన మన ఎలా ఉన్నామో ఆలోచిస్తే ఏమైపోతమో కూడా చెప్పలేని పరిస్థితి.

మన గ్రంథాలు జీవుడు ఎలా ఉంటే మోక్షం పొందుతాడు అనే నిర్ధారణ చేసి మరి నిరూపించి బోధిస్తున్నాయి. అందుకే శాస్త్ర ప్రకారం నడుచుకోమని పెద్దలు చెప్తారు.

ఇలా ఎందుకు అలా ఎందుకు అని ఎదురు ప్రశ్నలు వేయకూడదు. శాస్త్రం శాసనం పాటించాలి. పాటించిన వారికి మేలు చేస్తుంది తప్ప, పొరపాటున కూడా కీడు జరగదు.

– శ్రీచరణ్‌శర్మ