– ఎన్యుమరేషన్ ప్రక్రియ, పరిహారం చెల్లింపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
అమరావతి, మహానాడు: భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన ప్రజలకు పరిహారం పంపిణీ, ఎన్యుమరేషన్ ప్రక్రియపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయా శాఖల అధికారులతో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇప్పటికే ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తి అయ్యిందని అధికారులు తెలిపారు. దీంతో ఈనెల 25వ తేదీన బాధితులకు పరిహారం అందించాలని సీఎం నిర్ణయించారు. కాగా, ముఖ్యమంత్రి చంద్రబాబు వరద బాధితులకు అత్యుత్తమ పరిహారాన్ని ప్రకటించారు.
విజయవాడలో వరదకు మునిగిన ఇళ్ళలో గ్రౌండ్ ఫ్లోర్ వారికి రూ. 25 వేలు, మొదటి, ఆపై అంతస్తు వారికి రూ.10 వేల చొప్పున పరిహారం అందించనున్నారు. చనిపోయిన పశువులకు, నష్టపోయిన వ్యాపారులకు కూడా ఆర్థిక సాయం అందించనున్నారు. ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన పరిహారం అన్ని వర్గాల బాధితులకూ ఒకేసారి చెల్లించనున్నారు.
ఇళ్ళు మునిగిన వారితో పాటు, వాహనాలు దెబ్బతిన్న వారికి, పంటలు దెబ్బతిన్న రైతులకు పరిహారం బుధవారం అకౌంట్లలో నేరుగా ప్రభుత్వం జమ చేయనుంది. నష్టపరిహారం విషయంలో తమ పేరు నమోదు కాలేదు అనే ఫిర్యాదు ఎక్కడా రాకూడదని సీఎం అధికారులకు సూచించారు. 10 వేల వాహనాలకు ఇప్పటి వరకు ఆరు వేల వాహనాలకు బీమా సెటిల్మెంట్ పూర్తి అయినట్టు అధికారులు తెలిపారు. మిగిలిన వాహనాలకు కూడా బీమా పూర్తయ్యేలా చూడాలని అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు.