ప్రజలు తిరగబడి కేసీఆర్ కు పూలదండలు కాదు… చెప్పుల దండలతో రెడీగా ఉన్నారు
అబద్దాలకు హద్దు… పద్దు… ఉండాలి.
అంతా చేసి అమాయక చక్రవర్తిలా కేసీఆర్ మాట్లాడుతున్నారు
అసెంబ్లీకి రాకుండా పిల్లిలా పారిపోయింది కేసీఆర్ కాదా ?
– నల్గొండ సభలో కేసీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
రెండు నెలల తర్వాత ఎట్టకేలకు ప్రజల ముందుకు వచ్చిన కేసీఆర్ నిజాలు మాట్లాడుతారని భావించామనీ, కానీ ఆయన తన సహజ పద్ధతిలోనే అబద్ధాలు మాట్లాడారని రెవెన్యూ,హౌసింగ్. సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. నల్గొండ సభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలను మంత్రి శ్రీనివాస్ రెడ్డి మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు.
పులిలాగా పోరాడుతాను పిల్లిలా పారిపోనంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యల పైన స్పందిస్తూ.. కృష్ణా జలాలపై అసెంబ్లీలో జరిగిన చర్చకు రాకుండా పిల్లిలా పారిపోయిన కేసీఆర్ ను పులి అంటారా ? పిల్లి అంటారా ? అని ప్రశ్నించారు . ఒక నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే చాలు. బొంత పురుగు ను సైతం ముద్దు పెట్టుకుంటా…గొంగళి లో కూడా అన్నం తింటా… అని గొంతు చించుకొని మాట్లాడిన పెద్దలు ఈరోజు వారి నిజాలు, అక్రమాలు, తెలంగాణ సమాజం ముందుకు రాగానే కృష్ణా జలాల పై రాద్ధాంతం చేస్తున్నారు.
గడిచిన పదేళ్ళలో తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. నీళ్ల విషయంలో దోపిడీ.. నియామకాలలో అలసత్వం.. నిధుల దుబారా చక్రవర్తులు అందినకాడికి దోచుకున్నారు. పదేళ్లలో ఖజానాను లూటీ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గతంలో ఎన్నడూ జరగని అన్యాయం, అరాచకం, అవినీతి, అలసత్వం, దోపిడీ గత పదేళ్లలో జరిగింది.
ఇప్పుడేమో ఏమి ఎరుగని అమాయక చక్రవర్తులు లాగా నటిస్తున్నారు. అధికారంలో కొల్పోయిన తర్వాత తెలంగాణ ప్రజల ఉద్వేగాలను, మనోభావాలను రెచ్చగొట్టి, రాజకీయ ప్రయోజనాల కోసమే కొత్తగా కేఆర్ఎంబీ అంశాన్ని తెరపైకి తెచ్చి ఉల్టా చోర్ కొత్వాల్ డాంటే అన్నట్లు కేసీఆర్ వ్యవహరిస్తున్నారు.
కేసీఆర్ పాపం పడిరది. ప్రజలు తిరగబడి ఆయనకు బుద్ది చెప్పే రోజులు దగ్గర పడ్డాయి.పూలదండలు కాదు… చెప్పుల దండలతో రెడీగా ఉన్నారు. తెలంగాణ ప్రజానీకానికి క్షమాపణ చెప్పే రోజు కూడ వస్తుందని గుర్తు పెట్టుకోవాలి.
తెలంగాణ ప్రజలను మోసం చేసి గోబెల్స్ ప్రచారంతో రెండుసార్లు అధికారంలోకి వచ్చారు. ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టినా బుద్ధి రావడం లేదు. అబద్ధాలతోనే కాలం నడవదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ కోసం గొంగలి పురుగునైనా ముద్దాడుతా అని చెప్పిన కేసీఆర్ తెలంగాణ రాగానే రాబందుల్లా మారి రాష్ట్రాన్ని అందినకాడికి దోచుకున్నారు.
మీ పదేళ్ల దరిద్రపు పాలనలో కేసీఆర్ కుటుంబం తప్ప ఎవరూ బాగుపడలేదు. మొహం పగిలిపోయేలా ప్రజలు తీర్పు ఇచ్చినా బుద్ధి మారడం లేదు.
ఎందుకు తెలంగాణ ప్రజలు ఎన్నికల్లో చీకొట్టారని ఆత్మ పరిశీలన చేసుకోకుండా రెండు నెలల మా ప్రభుత్వం పై విమర్శలు చేయడం కేసీఆర్ కే చెల్లింది.
ఓటమితో మతిస్థిమితం తప్పి ఉనికిని కాపాడుకోవడానికి విమర్శలు చేస్తున్నారు.
తెలంగాణ ప్రజలను మోసం చేసి గోబెల్స్ ప్రచారంతో రెండుసార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్ కు మొన్నటి ఎన్నికల్లో ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టినా బుద్ధి రావడం లేదు. అదే గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు కూడా కాలేదు అప్పుడే బట్ట కాల్చి మీద వేస్తున్నారు. కొంచమైనా జ్ఞానం ఉండాలి అని అన్నారు.