– చదువుకుంటే ఏదైనా సాధ్యమే..
– విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి
– గురుకులాల్లో విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించాలి
– మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి
మైలవరం, మహానాడు: విద్యకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని, విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. గురువారం సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షి యల్ ఎడ్యుకేషన్ ఇనిస్ట్యూట్స్ సెక్రటరీ ప్రసన్న వెంకటేష్ తో కలిసి మంత్రి ఉమ్మడి క్రిష్ణా జిల్లా మైలవరం మండలం, కుంట ముక్కల, రెడ్డి గూడెం మండలం రంగాపురం బాలికల గురుకుల పాఠశాలలు సందర్శించారు.
తొలుత కుంటముక్కల పాఠశాలలో వరదలకు పడిపోయిన ప్రహరీ, మరుగుదొడ్లు, పాఠశాల పరిసరాలు పరిశీలించారు. కూలిపోయిన ప్రహరీని యుద్ధ ప్రాతిపదికన నిర్మించాలని అధికారులను ఆదేశించారు. గోడ నిర్మాణం పూర్తి అయ్యే లోపు రాత్రిపూట పాఠశాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం రెడ్డిగూడెం మండలం రంగాపురం బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థులతో కలిసి భోజనం చేసి విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గురుకులాల్లో విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని, గురుకులాల్లో బాలికలకు డిగ్రీ, ఐటీఐ కోర్సులు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. చదువులో వెనుకబడిన విద్యార్థుల్ని గుర్తించి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు.
చదువు ఉంటే ఏదయినా సాధ్యమేనని, విద్యార్థులు కష్ట పడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి. ప్రభుత్వం విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తోందన్నారు. కష్టపడి చదివి మీ తల్లిదండ్రుల కలలు నెరవేర్చాలని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి అన్నారు.