– అందుకు తగ్గట్టుగా వచ్చే విద్యాసంవత్సరం నుంచే కొత్త కరిక్యులమ్
– ప్రముఖ పారిశ్రామికవేత్తలతో వర్సిటీల్లో బోర్డ్ ఆఫ్ గవర్ననెన్స్
– ఉన్నత విద్యశాఖపై సమీక్షలో రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష
అమరావతి, మహానాడు: ఆంధ్రప్రదేశ్ లోని యూనివర్సిటీలు, ఇంజనీరింగ్ కళాశాలలు, ఉన్నత విద్యాసంస్థల నుంచి చదువు పూర్తిచేసుకొని బయటకు వచ్చేసరికి ప్రతి విద్యార్థికి ఉద్యోగం సిద్ధంగా ఉండాలని, ఇందుకు తగ్గట్టుగా వచ్చే విద్యాసంవత్సరం నుంచి కరిక్యులమ్ లో మార్పులు చేయాలని రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. రాష్ట్ర ఉన్నత విద్యశాఖ అధికారులతో మంత్రి లోకేష్ ఉండవల్లి నివాసంలో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… విద్యార్థులు ఆయా కళాశాలల్లో చదువుకునేటప్పుడే ప్రస్తుత మార్కెట్ ట్రెండ్స్ కు అనుగుణంగా స్కిల్ డెవలప్ మెంట్ ట్రైనింగ్ ఇవ్వాలని, బయట మళ్లీ శిక్షణ తీసుకునే పరిస్థితులు ఉండకూడదని స్పష్టంచేశారు.
కంప్యూటర్ సైన్స్, మెకానికల్ వంటి వాటితోపాటు సివిల్స్ శిక్షణ కూడా అంతర్భాగం చేసే అంశాన్ని పరిశీలించాలని అన్నారు. పరిశ్రమ పెద్దలతో చర్చించి వారి అవసరాలకు అనుగుణంగా సంస్కరణలు తీసుకురావాలని అన్నారు. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ లో రాష్ట్రానికి చెందిన యూనివర్సిటీలు వెనుకబడి ఉండటంపై మంత్రి అసంతృప్తి వ్యక్తంచేశారు. ర్యాంకింగ్స్ మెరుగుదలకు విద్యారంగ నిపుణుల సలహాలు తీసుకోవాలని అన్నారు. 2027నాటికి మెరుగైన ర్యాంకింగ్ కోసం ప్రతి యూనివర్సిటీకి లక్ష్యాన్ని నిర్దేశించాలని, ఆంధ్రా, ఆచార్య నాగార్జున వర్సిటీలో టాప్-10లో ఉండాలని అన్నారు.
రాష్ట్రానికి చెందిన యూనివర్సిటీల్లో విద్యనభ్యసించి కీలకస్థానాల్లో ఉన్న అల్యూమినీ ప్రముఖులతో వెబ్ సైట్ రూపొందించి ఆయా వర్సిటీలకు బ్రాండింగ్ కల్పించాలని చెప్పారు. ఆంధ్రా యూనివర్సిటీలో చదివిన జోషి పీటీఐ చైర్మన్ గా పనిచేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. అవసరమైతే ఆయా వర్సిటీల్లో చదువుకుని ఉన్నత స్థానాల్లో ఉన్న వంటి ప్రముఖులతో తాను ప్రత్యేకంగా సమావేశమవుతానని చెప్పారు. 2030, 2047 నాటికి యూనివర్సిటీల్లో ప్రమాణాల మెరుగుకు లక్ష్యాలను నిర్దేశించాలని అన్నారు. రాష్ట్రంలో చదువుకున్న ప్రతి విద్యార్థికి తప్పనిసరిగా అపార్ ఐడి ఏర్పాటుచేసి డిజి లాకర్ ఇవ్వాలని తెలిపారు. డిజి లాకర్ సమాచారాన్ని డ్యాష్ బోర్టుకు అనుసంధానం చేయాలని సూచించారు. ఇటీవల వరదల్లో సర్టిఫికెట్లు కోల్పోయిన విద్యార్థులకు తక్షణం జారీచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
భవిష్యత్తులో సర్టిఫికెట్ల కోసం యూనివర్సిటీలకు వెళ్ళకుండా పూర్తిస్థాయిలో డిజి లాకర్స్ సిద్ధం చేయాలని అన్నారు. ఏపీపీఎస్ సీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు సర్టిఫికెట్ల పరిశీలనకు ఎక్కువ సమయం పడుతోందని, రాబోయే రోజుల్లో డిజి లాకర్స్ ను ఏఐతో అనుసంధానించడం ద్వారా సులభంగా సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేయవచ్చని చెప్పారు. గత ప్రభుత్వం రూ. 2473 కోట్ల రూపాయల పోస్టు మెట్రిక్ స్కాలర్ షిప్ లను బకాయి పెట్టి వెళ్లిందని అధికారులు మంత్రి లోకేష్ దృష్టికి తెచ్చారు.
గత ప్రభుత్వ హయాంలో విదేశీ విద్య బకాయిలు ఏమేర ఉన్నాయని వాకబుచేయగా, రూ. 89 కోట్ల మేర ఉన్నాయని అధికారులు సమాధానమిచ్చారు. ఈ బకాయిలను ఏవిధంగా చెల్లించాలనే విషయమై మంగళవారం ముఖ్యమంత్రితో జరిగే ఉన్నత స్థాయి సమావేశంలో సీఎం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. వందరోజుల ప్రణాళికలో భాగంగా రాష్ట్రంలో వరల్డ్ క్లాస్ ఏఐ యూనివర్సిటీతోపాటు స్పోర్ట్ యూనివర్సిటీ ఏర్పాటుకు రూట్ మ్యాప్ సిద్ధంచేయాలని అన్నారు.
ప్రభుత్వం అందించే అన్ని పౌర సేవలు వాట్సప్ తో సహా వివిధ మాధ్యమాల ద్వారా ఫోన్లో పొందే సదుపాయం కల్పించాలని ఆదేశించారు. అలాగే వచ్చే ఏడాది నుండి జరిగే అన్ని ప్రవేశ పరీక్షల కౌన్సిలింగ్ ప్రక్రియనే సులభతరం చెయ్యాలని సూచించారు. ఉన్నత విద్య అభ్యసించే ప్రతి విద్యార్థికి స్టూడెంట్ యాప్ ద్వారా సమాచారం, సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఇంటర్ వర్సిటీ స్పోర్ట్స్ కాంపిటీషన్స్ నిర్వహణ, స్పోర్ట్స్ యూనివర్సిటీ కాన్సెప్ట్ ను సిద్ధం చేయాలని సూచించారు.
రీసెర్చ్ అండ్ ఇన్నొవేషన్, ఇన్నొవేషన్ పాస్ పోర్టు, యూనివర్సిటీ వైస్ చాన్స్ లర్ల నియామకానికి వస్తున్న దరఖాస్తులు, పారిశ్రామికవేత్తలతో వర్సిటీల బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ ఏర్పాటు వంటి అంశాలపై అధికారులతో మంత్రి లోకేష్ సమీక్షించారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యశాఖ కార్యదర్శి సౌరబ్ గౌర్, కాలేజ్ ఎడ్యుకేషన్ కమిషనర్ పోలా భాస్కర్, ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎండీ గణేష్ కుమార్, హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్ ఛార్జి చైర్మన్ కె.రామ్మోహన్ రావు, కేపీఎంజీ ప్రతినిధులు కుమార పురుషోత్తం, ఇమ్మని మోహన్ పాల్గొన్నారు.