గ్రామీణ నిరుద్యోగులపై దృష్టి పెట్టండి

-వారం రోజుల్లో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లు ప్రారంభిస్తాం
-ఆవాస గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం సంతృప్త స్థాయిలో చేపట్టాలి
-పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ, RWS బడ్జెట్ సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క

గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పంచాయతీ రాజ్ శాఖ అధికారులను కోరారు. శనివారం ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కతో కలిసి సచివాలయంలో బడ్జెట్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

గ్రామీణ యువత ఉపాధి లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు, వాళ్లను అలా వదిలేస్తే సమాజం ఇబ్బంది పడుతుందని వివరించారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకం అందుబాటులోకి రావడంతో వేలాదిమంది బీటెక్ పూర్తి చేసి, స్కిల్స్ లేక గ్రామాల్లోనే ఉండిపోతున్నారని, ఆర్థికంగా ఉన్నవారు, తోడ్పాటు అందిన వారు మాత్రం విదేశాల్లో స్థిరపడుతున్నారని వివరించారు.

గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను హైదరాబాద్ కి పరిమితం చేయకుండా, మొదట పాత ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలోని ఉపాధి కల్పన, మార్కెటింగ్ మిషన్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు ఎంతమందికి శిక్షణ ఇచ్చారు, వారు ప్రస్తుతం ఏం చేస్తున్నారు వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాదులోని సాఫ్ట్ వేర్ కంపెనీలతో అనుసంధానం చేసుకొని ఉపాధి కల్పించే అంశంపై పెట్టాలని తెలిపారు.

ఉపాధి హామీ పథకం కింద చెరువుల్లో పూ డికతీత పనులు చేపట్టారు, రైతులు ఉచితంగా ఆ పూడిక మట్టిని పొలాలకు తరలించుకున్నారు, అయినా అవి పక్కకు పెట్టి గత పది ఏళ్లలో మిషన్ భగీరథ పేరిట 25 వేల కోట్లు ఖర్చు చేయడంపై అధికారులను ఆరా తీశారు. ఉపాధి హామీలోని పూడికతీత పనులను విస్తృతంగా వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు.

గత ఐదు సంవత్సరాల కాలంలో మ్యాచింగ్ గ్రాంట్స్ వినియోగించి కేంద్ర నిధులను సాధించుకునే అంశంలో పూర్తిగా నిర్లక్ష్యం చెప్పారు. ఈసారి ఆ పొరపాటు జరగవద్దని తెలిపారు. స్వీపర్ల వేతనాలు పెండింగ్లో ఉంటే వాటికి సంబంధించిన వివరాలు వెంటనే పంపాలని అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ పథకం పనితీరుపై ఈనెల 15వ తేదీ వరకు నివేదిక ఇవ్వాలని కోరారు. ఆ నివేదికను అందరు ఎమ్మెల్యేలకు అందజేసి ఇంటింటికి నీరు అందుతున్న విషయాన్ని నిర్ధారించుకోవాలని తెలిపారు.

మిషన్ భగీరథ పథకం ద్వారా ఆదాయం సాధించి అప్పు చెల్లిస్తామని 30 వేల కోట్లు రుణం తీసుకొచ్చారు, కానీ ఆదాయం సాధించడం, అప్పు చెల్లించడంలో కార్పొరేషన్ పూర్తిగా విఫలమైందని డిప్యూటీ సీఎం అన్నారు. కార్పొరేషన్ విఫలం కావడం మూలంగా ప్రభుత్వమే ఆ అప్పులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అసలు గ్రామాల్లో మిషన్ భగీరథ నీటిని ఎంత శాతం మేరకు వినియోగిస్తున్నారు అనే అంశాన్ని సర్వేలో చేర్చాలని ఆదేశించారు.

60 శాతం మంది మాత్రమే మిషన్ భగీరథ నీటిని వినియోగిస్తున్నారని అధికారులు తెలిపారు. 30 వేల కోట్లు ఖర్చు చేసి పూర్తిస్థాయిలో ఈ పథకాన్ని వినియోగించుకోకపోతే అర్థం లేదని డిప్యూటీ సీఎం అన్నారు. మిషన్ భగీరథ నీటి నాణ్యత, ఆరోగ్యం తదితర అంశాలపై గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేసి చైతన్యం చేయాలని అధికారులను కోరారు.

మిషన్ భగీరథ నీటిని వినియోగించుకునే అంశం గ్రామ సభల్లో ఒక ఎజెండాగా చేర్చాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తనియా, ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి హరిత, పంచాయతీరాజ్ శాఖ అధికారులు దివ్య దేవరాజన్, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.