గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల

15 వ ఆర్థిక సంఘం నిధులు 250 కోట్లు 
పంచాయతీ రాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు వై.వి.బి.రాజేంద్రప్రసాద్ 

మంగళగిరి, మహానాడు:  గ్రామ పంచాయతీల అభివృద్ధికి 15 వ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యాయని పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి.రాజేంద్రప్రసాద్ అన్నారు. నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు నాయుడు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ లను ఆదివారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పంచాయతీ రాజ్ ఛాంబర్ రాష్ట్ర కమిటీ ప్రతినిధులతో కలిసి  మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో రాజేంద్రప్రసాద్ మాట్లాడారు.

గ్రామపంచాయతీలకు 15 వ ఆర్థిక సంఘం నిధులు 250 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసినందుకు రాష్ట్రంలోని 12,918 గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు,  జడ్పీటీసీలు, మూడున్నర కోట్ల గ్రామీణ ప్రజల తరపున ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, సర్పంచ్ సంఘాల నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ లకు కృతజ్ఞతలు తెలియజేసి సత్కరించామన్నారు. గత ఐదు సంవత్సరాలుగా వివిధ పద్దుల కింద గత జగన్ ప్రభుత్వం దొంగిలించి, దారి మళ్లించిన వేల కోట్ల నిధులను కూడా  రప్పించాలని ముఖ్య మంత్రికి విన్నవించారు.

ఈ కార్యక్రమంలో వై.వి.బి రాజేంద్ర ప్రసాద్ తో పాటు, పంచాయతీ రాజ్ ఛాంబర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాపరెడ్డి, ఉపాధ్యక్షులు కొత్తపు ముని రెడ్డి, సింగం శెట్టి సుబ్బరామయ్య, చిత్తూరు జిల్లా పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షుడు చుక్కా ధనుంజయ యాదవ్, పంచాయతీ రాజ్ ఛాంబర్  స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ డేగల కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.