రాజకీయాలకు దగ్గుబాటి గుడ్‌బై!

కారంచేడు, మహానాడు: రాజకీయాలకు భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి భర్త, సీనియర్ రాజకీయ నాయకుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గుడ్‌బై చెప్పారు. ఈ మేరకు ఆయన బాపట్ల జిల్లా, కారంచేడులో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా ఇదే తన చివరి ప్రసంగమని, మిగతా జీవితాన్ని పుస్తకాలు రాసుకుంటూ గడిపేస్తానని తెలిపారు. కోట్లు ఖర్చు చేసి గెలిచినా ప్రజల నుంచి చీత్కారాలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

కారంచేడులో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్, పురందేశ్వరి, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుతో కలిసి పాల్గొన్న వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాజకీయాలు పూర్తిగా డబ్బుమయంగా మారిపోయాయని వ్యాఖ్యనించారు.
ఓడరేవులో ప్రమాదాలు జరగకుండా నివారించేందుకు చీరాల ఎమ్మెల్యే కొండయ్య గజ ఈతగాళ్లను ఏర్పాటు చేసి వారికి జీతాలు చెల్లించేలా రిసార్ట్స్ వాళ్లతో మాట్లాడారని, కానీ, కొండయ్య డబ్బులు వసూలు చేస్తున్నారని వార్తలు రాశారని పేర్కొన్నారు. వరద బాధితులకు సాయం చేసేందుకు వైశ్య కమ్యూనిటీ నుంచి విరాళాలు సేకరించే సమయంలోనూ ఇలాంటి వార్తలే రాశారని తెలిపారు. డబ్బులు ఖర్చు చేసి రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేద్దామన్నా ఆరోపణలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.