చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రి పరిశీలించిన ప్రత్తిపాటి
అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై వైద్యులతో సమీక్ష
గుంటూరు, మహానాడు: కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా స్థానిక వంద పడకల ఆస్పత్రిని తీర్చిదిద్ది తీరుతామని ప్రకటించారు మాజీ మంత్రి, చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ముఖ్య మంత్రి చంద్రబాబు, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వై.సత్యకుమార్ సహకారంతో పట్టణ ప్రజ ల వైద్య అవసరాలకు పెద్దదిక్కుగా ఆ ఆస్పత్రిని త్వరలోనే సకల వసతులతో అభివృద్ధి చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు.
శనివారం చిలకలూరిపేట వంద పడకల ఆస్పత్రిని పరిశీలించిన ఆయన అన్ని విభాగాల్లోకి వెళ్లి రోగులకు అందుతున్న సేవలు, వసతుల గురించి తెలుసుకున్నారు. అనంతరం వైద్యులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించిన ఆస్పత్రి అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. విభాగాల వారీగా సమస్యలు, ఆస్పత్రికి కావలసిన పరికరాలు, సిబ్బంది, ఇతర వివరాలు తెలుసుకున్నారు.
అనంతరం మాట్లాడుతూ చిలకలూరిపేటలో తెలుగుదేశం పార్టీ గత ప్రభుత్వంలో రూ.18.57 కోట్లు నాబార్డు నిధులతో ఈ 100పడకల ఆసుపత్రి నిర్మాణం ప్రారంభించామన్నారు. చుట్టుపక్కల నుంచి వచ్చే పేదలు, చిలకలూరిపేటలో ఎక్కువ ఉండే దిగువ మధ్యతరగతి కోసమే ఈ ఆసుపత్రిని మంజూరు చేయించి నిధులు కూడా తీసుకొచ్చామని తెలిపారు. వైకాపా వైఫల్యం, చేతగానితనంతో ఐదేళ్లుగా పనులన్నీ నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ ఆస్పత్రికి పూర్తిస్థాయిలో వైద్యులు, సిబ్బంది, పరికరాలు సమకూర్చక పోవడం దారుణమన్నారు. స్థానిక మాజీ ఎమ్మెల్యే విడదల రజినీ ఆరోగ్యశాఖ మంత్రిగా ఉండి కూడా దీనిని పట్టించుకోలేదని వాపోయారు.
రాష్ట్రంలో ఉన్న వంద పడకల ఆస్పత్రుల్లోకెల్లా చిలకలూరిపేట పట్టణ హాస్పటల్ను ఆదర్శంగా తీర్చిదిద్దడంపై దృష్టి పెట్టామన్నారు. ఆస్పత్రి పరిసరాలు బావుండాలని వైద్యులకు సూచించారు. అవసరమైన గదులకు ఏసీ సౌకర్యం కూడా కల్పించాలని సూచించారు. ఇక్కడే వైద్యులు, సిబ్బంది కొరత ఉంటే కొంతమందిని డిప్యుటేషన్పై పంపించారని.. అవన్నీ చక్కదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం వైద్యఆరోగ్యశాఖ మంత్రిగా మంచి వ్యక్తి సత్యకుమార్ యాదవ్ వచ్చారని, మంచి ఆస్పత్రిగా తీర్చిదిద్దేందుకు ఆయనను ఒకసారి ఆహ్వానిస్తానని పేర్కొన్నారు.
పేదలకు నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉండాలని, వారిపై ఆర్థిక భారం పడకూడదని చెప్పారు. మొదటిసారి పరిశీలనకు వచ్చిన సందర్భంగా వైద్యులు, సిబ్బంది ఇబ్బందులు ఏంటో తెలుసుకున్నారు. అవుట్సోర్సింగ్ సిబ్బందితో పాటు కావాల్సిన పరికరాలను కూడా సమకూర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మెడికల్ స్టోర్లో ఏసీ లేదని, తక్షణమే దాన్ని ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. రక్తనిధి కేంద్రానికి కావాల్సిన మౌలిక వసతులు, మ్యాన్పవర్ ఇవ్వాలన్నారు.
జాతీయ రహదారి పక్కన ఉంది కాబట్టి ట్రామా కేర్ సెంటర్ ఉంటే ప్రమాదాల కేసులకు ఉపయోగపడుతుందన్నారు. మార్చురీ బాక్సు ఒకటే ఉందని చెప్పారని, మరో రెండు కావాలని అడిగారన్నారు. అంబులెన్స్, పోలీస్ అవుట్ పోస్ట్ కూడా ఏర్పాటు చేయాలని కోరారన్నారు. అవన్నీ పరిశీలిస్తామని చిలకలూ రిపేట వంద పడకల ఆస్పత్రిని ఉన్నతమైన ప్రాంతీయ ఆస్పత్రిగా తీర్చిదిద్దాలంటే సరిపడా వైద్యులు, సిబ్బందితో పాటు వైద్య పరికరాలను సమకూర్చాల్సిన అవసరం ఉందన్నారు. అలానే ఆరోగ్యశ్రీ స్థానంలో ఎన్టీఆర్ వైద్యం తీసుకొచ్చామని, నెల రోజుల్లో ఆరోగ్య బీమా రానుందని, చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ప్రతిఒక్కరికీ రూ.25 లక్షలతో ఆరోగ్య బీమా కూడా అతి త్వరలోనే అందిస్తామన్నారు. ఆరోగ్య బీమా వస్తే డబ్బులు లేకపోయినా ప్రతి పేదవాడు ధైర్యంగా వైద్యం పొందుతారని పేర్కొన్నారు. ఆర్థికంగా ఆలోచించే అవసరం లేకుండా ఉంటుందన్నారు.