– మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి మాజి మంత్రి హరీష్ రావు లేఖ
హైదరాబాద్: రాజకీయాలు పక్కనపెట్టి రైతాంగం సమస్యలు పరిష్కరించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్రావు కోరారు. ఆ మేరకు మిడ్మానేరు నుంచి నీటిని పంపింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి ఒక లేఖ రాశారు.
హరీష్రావు లేఖ పూర్తి పాఠమిదీ..
శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు,
తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి.
నమస్కారములు
సిద్దిపేట జిల్లాలోని అన్నపూర్ణ (అంతగిరి) రిజర్వాయర్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్ లు పూర్తి గా నీళ్లు లేక రిజర్వాయర్ లు అడుగంటి పోయే పరిస్థితికి చేరుకున్నాయి. గత సంవత్సరం ఇదే ఆగస్టు నెలలో అనంతగిరి రిజర్వాయర్ లో 3.32 టి ఎం సీల నీళ్ళు ఉంటే ప్రస్తుతం 0.75 టి ఎం సి లు, రంగనాయక సాగర్ లో 2.38 టి ఎం సి లకు గాను ప్రస్తుతం 0.67 టి ఎం సీలు, మల్లన్న సాగర్ 18 టి ఎం సీలకు గాను ప్రస్తుతం 8.5 టి ఎం సి లు, కొండ పోచమ్మ సాగర్ 10 టి ఎం సి లకు గాను ప్రస్తుతం 4.5 టి ఎం సీలు మాత్రమే ఉన్నాయి.
ఒకవైపు రిజర్వాయర్లలో నీళ్లు లేక, మరోవైపు వర్షాలు కురవక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. పంటలు వేయాలా వద్దా అనే అయోమయంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. గత సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే జిల్లాల పంటల సాగు విస్తీర్ణం కూడ తగ్గి పోయింది.
కాబట్టి రాజకీయాలు పక్కనబెట్టి మిడ్ మానేరు నుండి అన్నపూర్ణ రిజర్వాయర్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్ లకు నీటిని పంపింగ్ చేసేలా ఇరిగేషన్ అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేయాలని, అదేవిధంగా కాలువల ద్వారా నీటిని విడుదల చేసి ఆయకట్టుకు నీళ్లందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా రైతాంగం పక్షాన కోరుతున్నాను.
కృతజ్ఞతలతో..
తన్నీరు హరీశ్ రావు,
సిద్దిపేట శాసనసభ్యులు