ఉస్మానియా ఆస్పత్రిలో పర్యటించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి

-ఘన చరిత్ర ఉన్న ఉస్మానియా ఆస్పత్రి కి చికిత్స చెయ్యాలి
-తెలంగాణ రాష్ట్రంలో మెరుగైన మెడికల్ ఎడ్యుకేషన్ అందిస్తాం
-జి ఎన్ ఎం హాస్టల్ బిల్డింగ్ త్వరలో కట్టిస్తాం

హైదారాబాద్, మహానాడు: రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాదులోని చారిత్రాత్మక ఉస్మానియా ఆసుపత్రి లో పర్యటించారు.

ఈ పర్యటనలో 16 కోట్ల 68 లక్షల రూపాయలతో పనులకు ప్రారంభోత్సవం చేయగా,13.97 కోట్ల రూపాయలతో నూతనంగా ఏర్పాటుచేసిన అత్యాధునిక ఎం ఆర్ ఐ స్కాన్ యంత్రాన్ని ప్రారంభించారు. అంతే కాకుండా 2 కోట్ల 16 లక్షల రూపాయలతో నిర్మించిన ఆధునిక కిచెన్ ను,55 లక్షల రూపాయలతో జనరల్ మెడికల్ బ్లాక్ లో ఓపి కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ పర్యటన లో 5 కోట్ల 90 లక్షల రూపాయలతో సంకల్పించిన ఉస్మానియా ఆస్పత్రిలో మార్చురీ ఆధునీకరణ పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ
ఎంతో ఘన చరిత్ర ఉన్న ఉస్మానియా ఆస్పత్రి కి చికిత్స చెయ్యాల్సి ఉందన్నారు. గత పాలకులకు టీమ్స్ ఆసుపత్రుల నిర్మాణం పై ఉన్న శ్రద్ధ ఉస్మానియా ఆసుపత్రి పై లేదనీ, ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన పై సిఎం రేవంత్ రెడ్డి తో చర్చిస్తామన్నారు.

సమస్యలు ఉన్నప్పటికీ ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు, నర్సింగ్, సిబ్బంది మెరుగైన సేవలు అందజేస్తున్నారనీ, ఉస్మానియా ఆస్పత్రి లో 1951 లో నిర్మించిన జి ఎన్ ఎం నర్సింగ్ కాలేజీ హాస్టల్  భవనాన్ని నిర్మిస్తామన్నారు. హెల్త్ పాలసీ పై కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలిపారు.

ప్రైమరీ, సెకండరీ హెల్త్ విభాగాలను బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందనీ,రాబోయే తరాలు గుర్తుంచుకునేలా ప్రజా పాలన ఉంటుందన్నారు.ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ లో అన్ని రేట్స్ రివైస్ చేస్తున్నామనీ, హెల్త్ స్కీమ్స్ కి సంబంధించిన గ్యాప్స్ ఎక్కడ ఉన్నా వాటిని బలోపేతం చేస్తా మన్నారు.

పేదలకు ప్రమాణాలతో కూడిన విద్య మెరుగైన వైద్యాన్ని అందించడమే ప్రభుత్వ బాధ్యత అంటూ కొత్త బిల్డింగ్ కట్టడం, కట్టకపోవడం అనే ప్రశ్నే లేదనీ, కొత్త సెక్రటేరియట్ కట్టడం పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టడం కాదనీ, పేద వారికి మెరుగైన వైద్యం అందించాలనే తపన ఉండాలన్నారు.విజన్ ఉండాలి. ఉస్మానియా అంటే హైద్రాబాద్ కి షాన్ అనీ,ఉస్మానియా ఆస్పత్రిని కాపాడుకోవాలన్నారు. పరిపాలనలో కావలసినది అహంకారం కాదనీ ప్రజాపాలన అనేది గుర్తుకు రావాలనీ ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎం పి అనిల్ కుమార్ యాదవ్,ఎం ఎల్ సి లు ప్రభాకర్, వాణిదేవి, స్థానిక శాసనసభ్యులు రాజాసింగ్, స్థానిక కార్పొరేటర్ శంకర్ యాదవ్, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రభుత్వ కార్యదర్శి క్రిస్టినా, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్ వి కర్ణన్, ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ నాగేందర్ లు పాల్గొన్నారు.