-శాంతా బయోటెక్ వ్యవస్థాపకులు కె.ఐ.వరప్రసాద్రెడ్డి
-బషీర్బాగ్లో ప్రతాప్రెడ్డి 128వ జయంతి
హైదరాబాద్: తెలంగాణ వైతాళికులు సురవరం ప్రతాప్రెడ్డి జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చి భావితరాలకు స్ఫూర్తి కలిగించాల్సిన బాధ్యత పాలకులపై ఉందని శాంతా బయోటెక్ వ్యవస్థాపకులు, పద్మభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ కె.ఐ.వరప్రసాద్రెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం బషీర్బాగ్ దేశోద్దారక భవన్లో సురవరం ప్రతాప్రెడ్డి సాహిత్య వైజయంతి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించి న ప్రతాపరెడ్డి 128వ జయంతి వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసం గించారు. సామాజిక చైతన్యం కోసం నిర్మొహమాటంగా, నిర్భయంగా రచనలు అందించిన ఘనత ప్రతాప్రెడ్డికే దక్కుతుందని ప్రశంసించారు. గౌరవ అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ మాట్లాడుతూ సురవరం ప్రతాపరెడ్డి ఓ వ్యక్తి కాదని, సామాజిక శక్తి అని అన్నారు. తెలంగాణ రాజకీయ, సాంఘిక చైతన్యానికి ప్రతిరూపమని కొనియాడారు. గోల్కొండ పత్రికతో తెలంగాణ మాగాణంలో అక్షర సేద్యం చేసిన గొప్ప పాత్రికేయులు సురవరమేనని ఆయన స్పష్టం చేశారు. ప్రతాప్ రెడ్డి సాహిత్య ట్రస్ట్ చైర్మన్ ఆచార్య ఎల్లూరి శివారెడ్డి మాట్లాడుతూ తెలుగు విశ్వ విద్యాలయానికి సురవరం ప్రతాప రెడ్డి నామకరణం చేయాలన్నారు. అనంతరం సీనియర్ పాత్రికేయులు తిరునగిరి ఉదయవర్లుకు సురవరం ప్రతాపరెడ్డి స్మారక పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ మాజీ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, ట్రస్ట్ కార్యదర్శి డాక్టర్ సురవరం పుష్పలతా రెడ్డి, ప్రతాపరెడ్డి కుమారుడు సురవరం కృష్ణవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.