సన్నబియ్యం కొనకుండా టెండర్లు ఎలా పిలిచారు?

-సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలి
-ప్రభుత్వ పాత్ర లేకుంటే టెండర్లను రద్దు చేయాలి
-సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు నోరు మెదపడం లేదు
-ఆర్‌ఆర్‌ యాక్ట్‌ను ఎందుకు అమలు చేయడం లేదు
-సివిల్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ రవీందర్‌సింగ్‌

హైదరాబాద్‌, మహానాడు: తెలంగాణ భవన్‌లో సోమవారం సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ రవీందర్‌ సింగ్‌ మీడియా సమావేశంలో మాట్లాడారు. పౌర సరఫరాల శాఖ టెండర్లలో జరిగిన అవినీతిపై మా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆధారాలతో సహా ఆరోపణలు చేశారు. ఈ ప్రశ్నలకు ఉత్తమ్‌ సమాధానం చెప్పలేదు. టెండర్లు పిలిచింది నిజమా కాదా చెప్పాలి. రూ.200 కోట్ల మేర కూడా టెండర్లు దక్కించుకున్న వారు ధాన్యం కొనలేదని ఉత్తమ్‌ చెబుతున్నారు. తమ పార్టీ 15 రోజుల క్రితమే అవినీతి గురించి ప్రశ్నించే సరికి వారు భయపడ్డారు. సన్న బియ్యం గింజ కూడా తీసుకోలేదు అంటున్నారు. అలాంటప్పుడు టెండర్లు ఎట్లా పిలిచారు? 57 రూపాయలకు సన్న బియ్యం కొనాలని ప్రభుత్వమే టెండర్లలో రేటు నిర్ణయించింది నిజం కాదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వమే అంత రేటు నిర్ణయిస్తే బహిరంగ మార్కెట్‌లో ధరల పరిస్థితి ఏమిటి? ప్రజలపై భారం పడదా?

ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అబద్దాలు మాట్లాడుతున్నారు
ధాన్యానికి రూ.2007 అని టెండర్లలో నిర్ణయిస్తే రూ.2230 రూపాయలను ఏజెన్సీలు రైస్‌ మిల్లర్ల దగ్గర వసూల్‌ చేయడం నిజం కాదా? యుద్ధ విమానాలు నడిపిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అబద్దాలు మాట్లాడుతున్నారు. ఆదాయం పెంచుతున్నా మని చెబుతున్న ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, శ్రీధర్‌బాబు ఎట్లా ఆదాయం పెంచారో చెప్పాలి. ఎవరైనా అప్పులు తీసుకోవాల్సిందే. రైస్‌ మిల్లర్లతో మీటింగ్‌ పెట్టి బాండ్‌ పేపర్లు రాయించుకోలేదా? సివిల్‌ సప్లైస్‌ టెండర్లను వెంటనే రద్దు చేయాలి. ప్రభు త్వ పెద్దల పాత్ర లేకపోతే సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయించాలి.

ఆర్‌ఆర్‌ యాక్ట్‌ను ఎందుకు అమలు చేయడం లేదు
టెండర్ల ఆరోపణలపై బీజేపీ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. మహేశ్వర్‌ రెడ్డి, రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఒక్కటే. రేవంత్‌ రెడ్డి సీఎం అయ్యాక ఒక్కసారి మాత్రమే పౌరసరఫరా శాఖపై సమీక్షించారు. అన్ని శాఖలను మంత్రి శ్రీధర్‌ బాబు నడిపిస్తున్నారా? అని ప్రశ్నించారు. బియ్యంతో పాటు అన్ని రకాల వస్తువుల ధరల ను పెంచాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం చూస్తోంది. బియ్యం ధరను 57 రూపాయలకు పెంచాలని ఎవరు చెప్పారు. రైతుల ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి. ధాన్యం, బియ్యం టెండర్లపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జిపై విచారణ జరిపిం చాలి. అవినీతిపై బిఆర్‌ఎస్‌ న్యాయ పోరాటం చేస్తుంది. సీఎం రేవంత్‌ సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ అవినీతిపై ఏం చెబుతారు? బిఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో డిఫాల్టర్స్‌ ను జైలుకు పంపించాం. ఆర్‌ఆర్‌ యాక్ట్‌ను కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదు? పౌరసరఫరా శాఖలో అవినీతిని పక్కదారి పట్టించే ప్రయత్నం ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి చేస్తున్నారు. టెండర్లపై తెలంగాణ ప్రజలకు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.