Mahanaadu-Logo-PNG-Large

కువైట్ లో భారీ అగ్నిప్రమాదం.. 41మందికి పైగా మృతి

కువైట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ ఎత్తైన భవనంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో ఐదుగురు భారతీయులతో సహా 41 మంది సజీవదహనమయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
కువైట్‌లోని దక్షిణ మంగాఫ్ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. 41 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వ ఆధ్వర్యంలోని కువైట్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. బుధవారం తెల్లవారుజామున మంటలు చెలరేగడంతో భవనంలో మంటలు వ్యాపించాయి.

మంటలు అంటుకుని భవనం అంతా వేగంగా వ్యాపించాయి. దీంతో చాలా మంది లోపలే చిక్కుకున్నారు. ఈ భవనంలో ఎక్కువగా కార్మికులు నివాసం ఉంటున్నట్లు తెలుస్తోంది. ప్రమాదంలో 41 మంది మృతి చెందారని.. మరో 43 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు కువైట్ డిప్యూటీ ప్రధాని వెల్లడించారు.
మృతుల్లో ఐదుగురు కేరళకు చెందిన వారు ఉన్నట్లుగా సమాచారం. ఈ ఘటనపై విదేశాంగ మంత్రి జైశంకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక భారత రాయబార కార్యాలయం నుంచి కేంద్రమంత్రి సమాచారం సేకరిస్తున్నారు. మృతుల కుటుంబాలకు జై శంకర్ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.

బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని.. సహాయ అందిస్తామని కేంద్రమంత్రి పేర్కొన్నారు. “కువైట్ నగరంలో అగ్నిప్రమాద ఘటన వార్తతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. 40 మందికి పైగా మరణించారని మరియు 50 మందికి పైగా ఆసుపత్రి పాలయ్యారని తెలిసింది. తదుపరి సమాచారం కోసం మేము ఎదురుచూస్తున్నాం.” అని జైశంకర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.