Mahanaadu-Logo-PNG-Large

అవినీతిని ప్రశ్నిస్తే కేసులు పెడతారా?

ఆరోపణలు వాస్తవం కాదంటే సమాధానం చెప్పాలి
భయపడేది లేదు..ప్రజల కోసం దేనికైనా సిద్ధం
రేవంత్‌, ఉత్తమ్‌పై బీజేపీ ఎమ్మెల్యేల ధ్వజం

హైదరాబాద్‌, మహానాడు : ప్రభుత్వం అవినీతి, అక్రమాలను బీజేపీ శాసనసభాపక్ష నేతగా ప్రశ్నిస్తే కేసులు పెడతారా అంటూ బీజేపీ ఎమ్మెల్యేలు ఫైర్‌ అయ్యారు. రాష్ట్ర బీజేపీ కార్యాలయం లో శుక్రవారం మీడియా సమావేశంలో ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌, ముథోల్‌ ఎమ్మెల్యే రామారావు పాటిల్‌, సిర్పూర్‌ ఎమ్మెల్యే పాల్వయి హరీష్‌బాబు, నిజామాబాద్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ మాట్లాడారు. ఆధారాలతో రాష్ట్ర సర్కార్‌ అవినీతి, అక్రమానులను బయటపెడితే సమాధానం చెప్పాల్సిన సంబంధిత శాఖ మంత్రి ముఖం చాటేశారని, అధికారులతో సమాధానం చెప్పిం చి దాటవేసే ప్రయత్నం చేశారని ధ్వజమెత్తారు.

చట్టపరమైన చర్యలు తీసు కుంటామని, కార్యకర్తలతో కేసులు పెట్టించడం అరాచకమని మండిపడ్డారు. మా శాసనసభాపక్ష నేత ప్రభుత్వం చేసిన అవినీతి ఆరోపణలు వాస్తవం కాదం టే సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. కేసులకు, చట్టపరమైన చర్యలు బీజేపీ నాయకులు ఎప్పుడు భయపడరని హితవుపలికారు. ప్రజాగొంతుకగా, ప్రతిపక్ష నేతగా సర్కార్‌ అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తున్న బీజేపీ శాసనసభా పక్ష నేత మహేశ్వర్‌రెడ్డిపై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్‌ ప్రజాపాలనంటే అవినీతి, అక్రమాలు, దోచుకోవడం, దాచుకోవడమేనా? దానిని ప్రశ్నిస్తే కేసులు, బెదిరింపులేనా? ఎన్ని కేసులైనా, ఎన్ని బెదిరింపులైనా బీజేపీ నేతలు భయపడదని హెచ్చరించారు. అన్నం పెట్టే అన్నదాతలను, రేషన్‌ బియ్యంతో కడుపునింపుకునే నిరుపేదలను కూడా ఈ సర్కార్‌ పెద్దలు వదల కుండా దోపిడీ చేయడం దారుణమని దుయ్యబట్టారు.