చరిత్ర సృష్టించాలన్నా…దాన్ని తిరగరాయాలన్నా కాంగ్రెస్సే..

-ఖమ్మంలో రికార్డు మెజారిటీ అందించిన ప్రజలకు కృతజ్ఞతలు
-మీ వాణిని ఆర్‌ఆర్‌ఆర్‌ ఢిల్లీలో వినిపిస్తారు
-తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఖమ్మం : ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో చరిత్ర సృష్టించాలన్నా…. దాన్ని తిరగ రాయాలన్నా కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యం అవుతుందని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం పార్లమెంట్‌ నియోజక అభ్యర్థిగా రామసహాయం రఘురాం రెడ్డి విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఖమ్మం లోక్‌సభ చరిత్రలో ఇప్పటి వరకు ఎవరికీ ఇవ్వని మెజారిటీని ఆర్‌ఆర్‌ఆర్‌కు అందించడం కాంగ్రెస్‌ పార్టీకి గర్వకారణమన్నారు. ఈ విజయం దేశం యావత్తు గర్వించేలా ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ పై నమ్మకముంచి గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఖమ్మం కాంగ్రెస్‌ పార్టీ కంచుకోట అని మరోమారు ప్రజలు నిరూపించారన్నారు. ఎల్లవేళలా వారికి రుణపడి ఉంటామన్నారు. 4,62,011 లక్షల ఓట్ల మెజారిటీతో చరిత్ర సృష్టించడంలో భాగస్వాములు అయిన కాంగ్రెస్‌ పార్టీ ప్రజా ప్రతినిధులకు, నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఢిల్లీలో ఆర్‌ఆర్‌ఆర్‌ తన వాణిని వినిపిస్తారని తెలిపారు. ఢిల్లీలోని సోనియమ్మ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్‌ దిగ్గజాలు హర్షించేలా ఖమ్మంలోని కాంగ్రెస్‌ శ్రేణులంతా సంబరాలు చేసుకోవాలని పిలుపునిచ్చారు.