– నేర సమీక్షా సమావేశం డీజీపీ జితేందర్
విజయవాడ, మహానాడు: రాష్ట్రంలో నేరాలను నియంత్రించడానికి, నేర ధోరణులను విశ్లేషించడానికి, ప్రజల భద్రత పెంచడానికి, చట్టాల అమలును మెరుగుపరచడానికి అవసరమైన చర్యలపై డిజిపి డాక్టర్ జితేందర్ అధ్యక్షతన మంగళవారం నాడు డిజిపి కార్యాలయంలో సమగ్ర అర్ధవార్షిక నేర సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనరేట్ల సీపీలు, జోన్ల ఐజీలు, రేంజ్ డీఐజీలు, స్టాఫ్ అధికారులు హాజరయ్యారు. సమావేశంలో డిజిపి మాట్లాడుతూ, నివారణాత్మక పోలీసింగ్పై దృష్టిసారించాలని, రౌడీలు, ఇతర అసాంఘిక శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలతో సత్సంబంధాలు పెంపొందించుకోవాలన్నారు. మహిళలపై, చిన్నారులపై నేరాలపై, సైబర్ నేరాలపై, మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. అన్ని వర్గాలతో రోడ్డు భద్రతా సమావేశాలు నిర్వహించాలన్నారు. ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలు తగ్గినట్లు తెలిపారు. మరణాలు తగ్గించేందుకు ప్రమాద ప్రధాన ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని సూచించారు. డయల్ 100 ప్రతిస్పందన సమయాన్ని మెరుగుపరచాలని ఆదేశించారు.
సిఐడీ అడిషనల్ డిజిపి శిఖా గోయల్ నేరాల ధోరణులపై వివరణాత్మక ప్రదర్శన ఇచ్చారు. ప్రధాన నేరాల విశ్లేషణ నివేదికను సమర్పించి, ఆయా నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి నివారణ చర్యలపై వివరించారు. టీజీఏఎన్బీ డైరెక్టర్ సందీప్ శాండిల్య మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై, టీజీసీఎస్బీ డైరెక్టర్ సైబర్ నేరాలపై ప్రదర్శనలు ఇచ్చారు. మాదకద్రవ్యాలు, సైబర్ నేరాల నివారణకు యుద్ధప్రాతిపదికన కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించారు. తెలంగాణ మాదకద్రవ్యాల, సైబర్ నేరాలకు కేంద్రంగా మారకుండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సెల్ ఫోన్ దొంగతనాలు, మానవ అక్రమ రవాణా, ద్విచక్ర వాహనాల దొంగతనాలు, ముఠా నేరాలు తదితర అంశాలపై వివిధ అధికారులు ప్రదర్శనలు ఇచ్చారు.
ఇంటెలిజెన్స్ అడిషనల్ డిజిపి బి. శివధర్ రెడ్డి నక్సలైట్ల సంబంధిత నేరాలు, ఇతర చట్టం-వ్యతిరేక కార్యకలాపాల, శాంతి భద్రతలను ప్రభావితం చేసే ఇతర సమస్యల పై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అడిషనల్ డిజిపిలు అభిలాష బిష్ట్ (ట్రైనింగ్), వి.వి. శ్రీనివాసరావు (టెక్నికల్ సర్వీసెస్), విజయ్ కుమార్ (పర్సనల్ & వెల్ఫేర్), సంజయ్ కుమార్ జైన్ (బెటాలియన్స్) తమ విభాగాలకు సంబంధించిన అంశాలపై ప్రదర్శనలు ఇచ్చారు. సమావేశంలో 33 కేసుల (27 హత్యలు, 6 అత్యాచారాలు) లో నేరస్తులకు లైఫ్ కన్విక్షన్లు పడేలా తగు చర్యలు తీసుకున్న 36 మంది అధికారులు, 30 మంది ప్రాసిక్యూటర్లకు డీజీపీ ప్రశంసాపత్రాలు అందజేశారు. అర్ధవార్షిక నేర సమీక్ష సమావేశాన్ని తప్పనిసరిగా ప్రత్యక్షంగా నిర్వహించాలని, ప్రతినెలా డిజిపి స్థాయిలో నేర సమీక్ష సమావేశాన్ని వర్చువల్గా నిర్వహించాలని నిర్ణయించారు.