అవకాశవాద రాజకీయాలు మానుకో రేవంత్రెడ్డి
హైదరాబాద్ బీఆర్ఎస్ ఇన్చార్జ్ దాసోజు శ్రవణ్
హైదరాబాద్, మహానాడు: పార్టీ ఎవరినైనా ఎన్నికల బరిలో నిలబెట్టే అధికారం ఉంటుందని కానీ, 2023 ఎన్నికలలో పార్టీ గెలుపు కోసం గద్దరన్న కుమార్తెను పోటీలో నిలబెట్టి అధికారం వచ్చాక ఇప్పుడు మరో వ్యక్తిని అభ్యర్థిగా ప్రకటించడం పచ్చి మోసమని బీఆర్ఎస్ హైదరాబాద్ ఇన్చార్జ్ దాసోజు శ్రవణ్ శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు. ఓడలో ఉన్నంత వరకు ఓడ మల్లయ్య…ఒడ్డుకు చేరాక బోడ మల్లయ్య అన్నట్లుంది మీ శైలి అంటూ సీఎం రేవంత్రెడ్డిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వయోభారంతో అలసిపోయినప్పటికీ పట్టుదలతో కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం కష్టకాలంలో పాదయాత్రలు చేసి ఆడి, పాడి అసువులు బాసిన గౌరవ గద్దరన్నను, వారి కుటుంబాన్ని అవకాశవాదంతో విస్మరించి అవమానిం చడం నేరం కాదా అని ప్రశ్నించారు. సినిమా అవార్డులతో సంతోషపెట్టి అసలు రాజ్యాధికారం మాత్రం రాకుండా నయవంచన చేయడం న్యాయమా అని హితవుపలికారు.