సంపద సృష్టించడం అంటే ఇదేనా?

-7000 కోట్ల నుంచి రూ. 10,000 కోట్లకు అప్పులు
-సూపర్‌ సిక్స్‌ పథకాల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు
-రైతులకు సాయం ఎప్పుడు చేస్తారు?
-వైఎస్‌ఆర్‌సీపీ జాతీయ అధికార ప్రతినిధి కె.రవిచంద్రారెడ్డి

ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరి మరో నాలుగు రోజుల్లో నెల రోజులు పూర్తి కావొస్తుంది. టెక్నికల్‌గా జులై 12కు నెల రోజులవుతుంది. చంద్రబాబు మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు, సూపర్‌ సిక్స్‌ పథకాల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. రేపు పెన్షన్స్‌ కోసం కొంత వెసులుబాటు ప్రయత్నాలు చేస్తున్నారు.

మేం సంపద సృష్టిస్తాం, అప్పులు చేయమని అధికారంలోకి వచ్చిన మీరు మూడు వారాల్లోనే రూ. 7000 కోట్ల నుంచి రూ. 10,000 కోట్లకు అప్పులు తెచ్చేందుకు ఏర్పాట్లు చేశారు, మరి సంపద సృష్టించడం అంటే ఇదేనా? సంక్షేమ కార్యక్రమాల అమలుకు సంపద సృష్టిస్తామన్న మాట మీద నిలబడండి, మీ హామీల అమలుకు ప్రజలు ఎదురుచూస్తున్నారు. లబ్ధిదారులందరికీ అన్ని సంక్షేమ పథకాలు అమలుచేయాలని కోరుతున్నాం.

రేపు ఇచ్చే పెన్షన్లు వలంటీర్లతో కాకుండా సచివాలయ ఉద్యోగులతో ఇస్తున్నారు కదా ఇది రేపు ఒక్క రోజుకేనా లేక పూర్తిగా ఇదే పద్దతి కొనసాగిస్తారా? మరి వలంటీర్లకు రూ. 5000 కు బదులు రూ. 10,000 గౌరవ వేతనం ఇస్తామన్నారు కదా, మరి వారిని ఏం చేస్తారు, అమ్మ ఒడిని తల్లికి వందనం పేరుతో ఇస్తామన్నారు కదా మరి స్కూల్స్‌ ప్రారంభమయ్యాయి, మరి ఎప్పుడు ఇస్తున్నారు.

కేంద్రం నుంచి రైతులకు రైతు భరోసా సాయం అందింది, మరి మీరిచ్చిన మాట ప్రకారం రైతులకు సాయం ఎప్పుడు చేస్తారు తేదీ ప్రకటించండి.

మీరు వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం, ఆస్తుల విధ్వంసం ఎంతవరకు సమంజసం, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకునేలా జనరంజక పాలన చేయాలి కానీ ఇలా దాడులు చేయడం సరికాదు. ఇలాంటి అరాచకాలకు పుల్‌స్టాప్‌ పెట్టి ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై మీరు దృష్టిసారించాలని కోరుతున్నాం.