అసెంబ్లీకి పోని జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి

– ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా

అమరావతి: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అసెంబ్లీలో అడుగుపెట్టే విషయంపై జగన్ మోహన్ రెడ్డి సానుకూలత లేని స్థితిని షర్మిలా రెడ్డి తీవ్రంగా ఖండించారు.

ఈ రోజు మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, “ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగుపెడతా అనడం జగన్ గారి అజ్ఞానానికి నిదర్శనమని… ఇంతకుమించిన పిరికితనం, చేతకానితనం, అహంకారం ఎక్కడ కనపడవు, వినపడవు” అని పేర్కొన్నారు.

జగన్ మోహన్ రెడ్డి గారు…మోసం చేయడం మీకు కొత్తేమీ కాదు. కానీ మిమ్మల్ని ఎన్నుకుని, అసెంబ్లీకి పంపిన ప్రజలను ఇలా వెర్రిగా, వింతగా మోసం చేయడం, ఓట్లు వేసిన ప్రజలను అవమానించడం మీకే చెల్లింది. అసెంబ్లీకి వెళ్లకపోవడం ప్రజాస్వామ్యాన్ని హేళన చేయడమే . ఎమ్మెల్యేగా గెలిచింది చట్టసభల్లో ప్రజల గొంతు అవ్వాలని, కానీ మీడియా ముందు సొంత డబ్బా కొట్టుకోవడానికా కాదు అని ఆమె అన్నారు.

ఐదేళ్ల పాలన అంతా అవినీతి, దోపిడి మయం చేశారు. రాష్ట్రాన్ని మీరు అప్పుల కుప్ప చేసి పెట్టారు. నిండు సభలో అధికార పక్షం శ్వేతపత్రాలు విడుదల చేస్తుంటే…  ప్యాలస్ లో కూర్చుని మీడియా మీట్ లు పెట్టడానికి కాదు ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేను చేసింది. గత మీ పాలనపై విమర్శలకు, అసెంబ్లీలో ఆన్ రికార్డు సమాధానం ఇచ్చుకునే బాధ్యత మీది కాదా..? ప్రజలకు అన్యాయం జరిగితే అధికార పక్షాన్ని ఫ్లోర్ అఫ్ ది హౌస్ లో ప్రశ్నించే బాధ్యత మీది కాదా? అని షర్మిలా ప్రశ్నించారు.

జగన్ మోహన్ రెడ్డి తక్షణమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాతీర్పును గౌరవించకుండా, అసెంబ్లీకి పోనని చెప్పే వారు ఎమ్మెల్యేగా ఉండే అర్హత లేదు అని ఆమె తీవ్రంగా పేర్కొన్నారు. బడికి పోను అనే పిల్లోడికి టీసీ ఇచ్చి ఇంటికి పంపిస్తారు, ఆఫీసుకు పోననే పనిదొంగను వెంటనే పనిలోంచి పీకేస్తారు. అలానే ప్రజాతీర్పును గౌరవించకుండా, అసెంబ్లీకి పోను అంటూ గౌరవ సభను అవమానించిన వాళ్లకు ఎమ్మెల్యేగా ఉండే అర్హత లేదు. ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పోనప్పుడు మీరు ఆఫ్రికా అడవులకు పోతారో, అంటార్టికా మంచులోకే పోతారో ఎవడికి కావాలి . అసెంబ్లీకి పోని జగన్ అండ్ కో తక్షణం మీ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.