భద్రాచలం – మల్కాన్ గిరి నూతన రైల్వేలైన్ కు ఆమోదంపై ప్రధానికి కిషన్ రెడ్డి ధన్యవాదాలు

హైదరాబాద్‌, మహానాడు: భద్రాచలం – మల్కాన్ గిరి నూతన రైల్వేలైన్ కు ఆమోదంపై ప్రధాన మంత్రి మోదీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఆ వివరాలు… నిన్న జరిగిన కేంద్రమంత్రి మండలి సమావేశంలో 7 రాష్ట్రాల మీదుగా వెళ్ళే 8 నూతన రైల్వేలైన్ ప్రాజెక్టులకు ఆమోదం. వీటి పొడవు 800 కి. మీ. లు కాగా అంచనా వ్యయం రూ. 24,657 కోట్లు. ఈ 8 నూతన రైల్వే లైన్లలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న భద్రాచలం రైల్వే లైన్ కూడా ఒకటి. భద్రాచలం – మల్కాన్ గిరి నూతన రైల్వే లైన్ కు ఆమోదం తెలపడం పట్ల ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ధన్యవాదాలు తెలియజేసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. 173 కి. మీ. పొడవైన భద్రాచలం – మల్కాన్ గిరి ప్రాజెక్టు ప్రాథమిక అంచనా వ్యయం రూ. 4,109 కోట్లు.

భద్రాచలం పుణ్యక్షేత్రాన్ని మెయిన్ లైన్ రైల్ నెట్ వర్క్ తో అనుసంధానం చేయనున్న నూతన ప్రాజెక్టు. 2024 ఏప్రిల్‌ ఒకటోతేదీ నాటికి తెలంగాణ రాష్ట్రంలో వివిధ దశలలో ఉన్న రూ. 32,946 కోట్ల విలువైన 2,298 కి.మీ. పొడవు గల 20 రైల్వే ప్రాజెక్టులు. 2023-24 బడ్జెట్ లో తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి రూ. 4,418 కోట్లు కేటాయించగా, 2024-25 బడ్జెట్ లో రూ. 5,336 కోట్లు కేటాయింపు. 2009-14 మధ్యన సంవత్సరానికి సగటున 17.4 కి. మీ. చొప్పున 87 కి. మీ. ల రైల్వే లైన్లు అందుబాటులోకి రాగా, 2014-24 మధ్యన 3.7 రెట్లు ఎక్కువగా సంవత్సరానికి సగటున 65 కి. మీ. చొప్పున 650 కి. మీ. ల రైల్వే లైన్లు అందుబాటులోకి వచ్చాయి.

దేశవ్యాప్తంగా రైల్వే కనెక్టివిటీని మరింత బలోపేతం చేయాలన్న ఉద్దేశ్యంతో 7 రాష్ట్రాలకు లబ్ధి చేకూర్చేలా రూ. 24,657 కోట్ల అంచనా వ్యయంతో 800 కి. మీ. ల పొడవున నిర్మించనున్న 8 నూతన రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలుపుతూ ఈ నెల 9 వ తేదీన జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది.

కేంద్ర మంత్రి మండలి ఆమోదించిన 8 నూతన రైల్వే లైన్ ప్రాజెక్టులలో రూ. 4,109 కోట్ల అంచనా వ్యయంతో 173 కి. మీ. ల పొడవున నిర్మించనున్న భద్రాచలం – మల్కాన్ గిరి నూతన రైల్వే లైన్ ప్రాజెక్టు కూడా ఉండటంతో తెలంగాణ రాష్ట్రానికి కూడా పెద్దఎత్తున లబ్ధి చేకూరనుంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న భద్రాచలం పట్టణానికి నూతన రైల్వే లైన్ డిమాండ్ ఈ ప్రాజెక్టుతో నెరవేరనుంది.

భద్రాచలం (పాండురంగాపురం) – మల్కాన్ గిరి (జునాఘడ్) నూతన రైల్వే లైన్ ప్రాజెక్టు భద్రాచలం పట్టణాన్ని మెయిన్ లైన్ రైల్ నెట్ వర్క్ తో అనుసంధానం చేస్తుంది. మొదట ప్రతిపాదించిన భద్రాచలం – మల్కాన్ గిరి రైల్వే లైన్ 147.5 కి. మీ. లు మాత్రమే. అనంతరం ఈ ప్రాజెక్టును మరో 26.1 కి. మీ. లు పెంచి భద్రాచలం నుంచి పాండురంగాపురం వరకు పొడిగించడం జరిగింది. జైపూర్ – మల్కాన్ గిరి మధ్యన చేపట్టిన నూతన రైల్వే లైన్ ఇప్పటికే నిర్మాణంలో ఉండగా, ఇప్పుడు కొత్తగా ప్రతిపాదించిన భద్రాచలం – మల్కాన్ గిరి నూతన రైల్వే లైన్ సౌత్ సెంట్రల్ రైల్వే (పాండురంగాపురం) – ఈస్ట్ కోస్ట్ రైల్వే (జునాఘడ్) మధ్యన నూతన కారిడార్ అభివృద్ధికి బాటలు వేయనుంది.

ఈ ప్రాజెక్టు కారణంగా ఇప్పటి వరకూ ఎటువంటి రైల్వే సౌకర్యం లేని అనేక ప్రాంతాలకు నూతనంగా రైల్వే సౌకర్యాలు అందుబాటులోకి రావడంతోపాటు ఆయా ప్రాంతాలు సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధిని సాధించనున్నాయి. అంతేకాకుండా ఈ నూతన ప్రాజెక్టు వలన తెలంగాణ, ఛత్తీస్ ఘడ్, ఒడిషా రాష్ట్రాల మధ్యన ప్రజల రాకపోకలు పెరగడమే కాకుండా ఆయా ప్రాంతాలు వ్యవసాయం, వాణిజ్యం, విద్య, పర్యాటకం, ఆరోగ్య సంరక్షణ వంటి వివిధ రంగాలలో వృద్ధిని సాధించడానికి కూడా ఉపయోగపడుతుంది.

ఈ నూతన ప్రాజెక్టు దక్షిణ ఒడిశా, ఛత్తీస్ ఘడ్ ప్రాంతాలు, దక్షిణ భారతదేశంలోని ఇతర ప్రాంతాలతో వాణిజ్య సంబంధాలు పెంపొందించుకోవడానికి ఒక ప్రత్యామ్నాయ మార్గంగా ఉపయోగపడటమే కాకుండా, ఒడిషా, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలలోని గనులు, అల్యూమినియం, స్టీల్ ఫ్యాక్టరీల నుండి ఆంధ్రప్రదేశ్ సముద్రతీర ప్రాంతంలో ఉన్న పోర్టులకు ఉత్పత్తులను తరలించడానికి దూరం కూడా 140 కి. మీ. తగ్గుతుంది.

ఈ నూతన రైల్వే లైన్ ఛత్తీస్ ఘడ్ నుంచి ప్రజలు హైదరాబాద్, విజయవాడ ప్రాంతాలను చేరుకోవడానికి దూరాన్ని, ప్రయాణ సమయాన్ని తగ్గించడమే కాకుండా దక్షిణ ఒడిషా, సెంట్రల్ ఒడిషా ప్రాంతాల నుంచి హైదరాబాద్, విజయవాడ నగరాలకు నేరుగా కనెక్టివిటీని అందుబాటులోకి తెస్తుంది. అంతేకాకుండా పారాదీప్ పోర్టును అనుసంధానిస్తూ ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న నేషనల్ వాటర్ వే 5 తో భవిష్యత్తులో ఈ నూతన రైల్వే ప్రాజెక్టును అనుసంధానించి మల్టీమోడల్ ట్రాన్స్ పోర్ట్ ను అభివృద్ధి చేసే అవకాశం కూడా ఉంది. దీనితోపాటు జాతీయ రహదారి 326 మీదుగా జరుగుతున్న సరుకు రవాణాను మరింత వేగంగా, సమర్థవంతంగా నిర్వహించడానికి పెద్ద మొత్తంలో ఆకర్షించి రైల్వే నెట్ వర్క్ తో అనుసంధానం చేసే అవకాశం కూడా ఉంది.

ఈ నూతన రైల్వే ప్రాజెక్టుకు ఉన్న మల్టీ మోడల్ ట్రాన్స్ పోర్ట్ అవకాశం దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో ఉన్న కృష్ణపట్నం, మచిలీపట్నం, నూతనంగా నిర్మిస్తున్న రామాయపట్నం పోర్టుల నుంచి కూడా సరుకు రవాణాను సమర్థవంతంగా నిర్వహించడానికి అవకాశం ఉంది.

కొత్తగా పట్టాలెక్కనున్న ఈ నూతన రైల్వే ప్రాజెక్టుతో పాటుగా 01.04.2024 నాటికి తెలంగాణ రాష్ట్రంలో రూ. 32,946 కోట్ల విలువైన 2,298 కి.మీ. పొడవు గల 20 రైల్వే ప్రాజెక్టులు వివిధ దశలలో ఉన్నాయి. అందులో రూ. 16,935 కోట్ల అంచనా వ్యయంతో 997 కి. మీ. పొడవు గల 7 నూతన రైల్వే లైన్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇందులో మార్చి నాటికి రూ. 4,433 కోట్లు ఖర్చు చేసి 245 కి. మీ. ల రైల్వే లైన్ ను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. రూ. 16,010 కోట్ల అంచనా వ్యయంతో 1,301 కి. మీ. ల పొడవున మరో 13 డబ్లింగ్ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉండగా, మార్చి, 2024 నాటికి రూ. 5,526 కోట్లు ఖర్చు చేసి 230 కి.మీ. ల డబ్లింగ్ లైన్ ను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.

రైల్వే బడ్జెట్ కేటాయింపులలో కూడా తెలంగాణ రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతోంది. 2023-24 బడ్జెట్ లో తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి రూ. 4,418 కోట్లు కేటాయించగా, 2024-25 బడ్జెట్ లో రూ. 5,336 కోట్లు కేటాయించారు.
గతంతో పోలిస్తే మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత తెలంగాణలో రైల్వే లైన్ల పొడవు గణనీయంగా పెరిగింది. 2009-14 మధ్యన సంవత్సరానికి సగటున 17.4 కి. మీ. చొప్పున 87 కి. మీ. ల రైల్వే లైన్లు అందుబాటులోకి రాగా, 2014-24 మధ్యన 3.7 రెట్లు ఎక్కువగా సంవత్సరానికి సగటున 65 కి. మీ. చొప్పున 650 కి. మీ. ల రైల్వే లైన్లు అందుబాటులోకి వచ్చాయి.