రేవంత్ కండకావరంతో మాట్లాడుతున్నారు

-ఆయనకు ముఖ్యమంత్రినన్న సోయి లేదు
-సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీపై మండిపడ్డ కేటీఆర్
-రేవంత్ రెడ్డి, రాహుల్ గాందీ నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలి

హైదరాబాద్, మహానాడు: నిరుద్యోగ యువకులు, విద్యార్థులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తీవ్రంగా మండిపడ్డారు . తన అడ్డగోలు వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని యువతకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యంగా, నిర్లజ్జగా ముఖ్యమంత్రి తన స్థాయికి దిగజారి, అత్యంత దివాళకోరుతనంతో మాట్లాడారని విమర్శించారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ…

నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తున్న మోతీలాల్ ని సీఎం అవమానించారు. అశోక్ నగర్ కోచింగ్ సెంటర్లకు వెళ్లి ఉద్యోగాలు సంపాదించుకున్న రేవంత్ రెడ్డి అదే కోచింగ్ సెంటర్ల వారిని అవమానించి మాట్లాడుతున్నారు. అందుకే ఈరోజు తెలంగాణ యువత భగ్గుమంటుంది. మమ్మల్ని దించి మిమ్మల్ని గద్దెనెక్కించిన అదే యువత ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. ఎనిమిది  నెలల్లో ఇప్పటిదాకా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. మిగిలిన నాలుగు నెలల్లో ఏ విధంగా రెండు లక్షల నోటిఫికేషన్లు ఇస్తారో చెప్పాలి. మిమ్మల్ని వదిలిపెట్టం. క్షేత్రంలో నిలదీస్తాం. విద్యార్థులతో నిరుద్యోగులతో కలిసి కొట్లాడతాం.

ఇది రాజకీయ పార్టీల సమస్య కాదు… లక్షలాదిమంది యువతకు సంబంధించిన అంశం. ఈ అంశంలో రేవంత్ రెడ్డి ఈగోకి, బేషజాలకు పోకుండా నిర్ణయం తీసుకోవాలి. కండకావరంతో మాట్లాడడం రేవంత్ రెడ్డి ఆపాలి.

నిరుద్యోగులు, విద్యార్థులపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలి. రాజకీయ నిరుద్యోగులుగా యువతను రెచ్చగొట్టిన రాజకీయ శక్తులు ముమ్మటికి రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీలే.

గతంలో ఏ పరీక్ష రాస్తుండని రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి నిరుద్యోగులతో దీక్ష చేసిందో చెప్పాలి. అశోక్ నగర్లోని విద్యార్థులను సన్నాసులు అంటున్న రేవంత్ రెడ్డి, మీరు సన్నాసులా, రాహుల్ గాంధీ సన్నాసులు అనే విషయం చెప్పాలి. అశోక్ నగర్లో యూనివర్సిటీలో పిల్లలను ఈడ్చుకు పోతున్న అంశం వాస్తవం కాదా రేవంత్ రెడ్డి చెప్పాలి.  రేవంత్ రెడ్డి ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్లుగానే మాట్లాడుతున్నాడు. ఆయన ముఖ్యమంత్రిని అనే విషయాన్ని గుర్తుంచుకొని మాట్లాడితే ఆయనకే మంచిది.

రేవంత్ రెడ్డికి సత్తా ఉంటే చిత్తశుద్ధి ఉంటే  ఉద్యోగాలపైన, నోటిఫికేషన్ల పైన, జాబ్ క్యాలెండర్ పైన శ్వేత పత్రం ప్రకటించాలి. నిరుద్యోగులు అడుగుతున్న డిమాండ్లను వెంటనే సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలి. గ్రూప్ వన్ మెయిన్స్ రేషియోను 1:100 గతంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీని నెరవేర్చాలి. అక్టోబర్ నవంబర్ 2023లో తెలంగాణ యువతను రెచ్చగొట్టి అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులను, నిరుద్యోగులను రెచ్చగొట్టారు. అనేక అవాకులు చావాకులు పేలి, రాజకీయ నిరుద్యోగాన్ని తీర్చుకోవడానికి రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి  యువతను రెచ్చగొట్టారు.

అధికారంలోకి రాగానే వందల నోటిఫికేషన్లు, రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఒక్క సంవత్సరంలో ఇస్తామని నమ్మబలికారు. నోటిఫికేషన్ల తేదీలతో సహా అనేక ప్రకటనలు కూడా ఇచ్చారు.  ఇప్పుడు ఒకాయన ముఖ్యమంత్రి అయ్యిండు. ఇంకొక ఆయన జాతీయ స్థాయిలో నాయకుడు అయిండు. కానీ తెలంగాణ నిరుద్యోగులకు దక్కింది శూన్యం. ఇప్పటిదాకా ఒక్క ఉద్యోగాన్ని కానీ నోటిఫికేషన్ కానీ ఇయ్యలేదు.  కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటిదాకా ఒక్క ఉద్యోగాన్ని కూడా నింపలేదు.

అశోక్ నగర్, దిల్ సుఖ్ నగర్, రాష్ట్రంలోని యూనివర్సిటీలో అడుగుతున్న విద్యార్థులు అడుగుతున్నది కాంగ్రెస్ ఇచ్చిన హామీలనే కదా. రెండు లక్షల ఉద్యోగాల గురించి అడుగుతున్నారు. గ్రూప్ 2 గ్రూప్ 3లో పోస్టులను పెంచమని అడుగుతున్నారు. 50వేల ఉద్యోగాలతో వేస్తామన్న మెగా డీఎస్సీ గురించి అడుగుతున్నారు.

కానీ ఇవి అడుగుతున్న నిరుద్యోగులు, యువకులపై అత్యంత దివాళకోరుతనంతో ముఖ్యమంత్రి మాట్లాడారన్నారు.
రెండు లక్షల ఉద్యోగాలు ఎలా ఇస్తారో చెప్పాలి. మిమ్మల్ని మేము అసెంబ్లీలో నిలదీస్తాం. సీఎం రేవంత్ రెడ్డి కండకావరం తగ్గించుకొని ఉద్యోగాల భర్తీ చేపట్టాలి.

అసెంబ్లీ లో వాయిదా తీర్మానం ఇస్తాం, లేదంటే అసెంబ్లీనీ స్తంభింపజేస్తాం. నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన దిక్కుమాలిన మాటలకు క్షమాపణ చెప్పాలి. బక్క జడ్సన్ దొంగ దీక్ష అంటున్నాడు. గతంలో రేవంత్ రెడ్డి ఎలా చేశాడు. నిరుద్యోగులు సన్నాసులు అంటున్నావ్ మంచిది కాదు. నిన్న రాత్రి దాకా నిరుద్యోగులు ధర్నా చేశారు. హాస్టల్లో ఉన్న వారిని కూడా గొడ్లను ఈడ్చుకెళ్లి నట్టు ఈడ్చుకెళ్లారు. వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.