– స్వామి వారు అత్యంత సంపన్నుడు
– ఆయన ప్రసాదం కల్తీ కావడమేంటి?
– సీబీఐతో దర్యాప్తు చేపట్టాలి
– అందుకే గవర్నర్కు కలిశాం..
– దర్యాప్తు చేయాలని అడిగే హక్కు వైసీపీకి లేదు
– ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి విమర్శ
విజయవాడ, మహానాడు: తిరుమలలోని శ్రీవారి మహా ప్రసాదం లడ్డూ ప్రసాదంలో జరిగిన కల్తీ అంశం మీద గవర్నర్ ను కలిశామని, కోట్లాది మంది భక్తుల మనోభావాలను సంబంధించిన విషయం ఇదని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆమె మీడియాతో ఏమన్నారంటే… ఇది చాలా సెంటిమెంట్ అంశం. ఏ మతమైనా గొప్పది, ఏ ధర్మం అయినా గొప్పది. అన్ని మతాలను గౌరవించాలి. కోట్ల మంది ప్రజలు ఇప్పుడు బాధలో ఉన్నారు. రెండు అంశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఎన్డీడీబీ రిపోర్ట్ ప్రకారం లడ్డూ లో వాడే నెయ్యి కల్తీ జరిగింది. ఫిష్, బీఫ్, పిగ్ కొవ్వుల నూనె ఉందని తేలింది. భక్తులకు పంపిణీ చేసే నెయ్యి 320 కే కొనడం ఏంటి? స్వామి ప్రసాదానికి వాడే నెయ్యి 16 వందలకు కొంటున్నారు. స్వామి ప్రసాదాన్ని అంత రేటుకి కొని భక్తులకు ఇచ్చే లడ్డుల్లో తక్కువ రేటు నెయ్యి వాడుతారా? 320 కి కొనేది నెయ్యినా? లేక నూనేనా? ఇంకా ఏమైనా ఉందా? ఇక్కడే అసలు విషయం తెలుస్తుంది.
లడ్డూ వాడకంలో ఉపయోగించే నెయ్యి కల్తీ జరిగింది. ఇది భక్తులకు సంబంధించిన అంశం. జులై 23న రిపోర్ట్ వస్తే బాబు ఇంతకాలం ఎందుకు దాచారు? లడ్డూ కల్తీపై సమగ్ర దర్యాప్తు జరగాలి. రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేసినా…కేంద్ర సంస్థలతో కూడా దర్యాప్తు చేపించాలని, అందుకే గవర్నర్ ను కలిశాం. సీబీఐతో విచారణ చేయించాలని కోరాం. లడ్డూ కల్తీపై బాధ్యులు ఎవరో తేల్చాలి. స్వామి వారి ఆదాయం దాదాపు ఏడాదికి 3 వేల కోట్లకు పైగానే.. ఆయన సంస్థల విలువ 3 లక్షల కోట్లకు పైగానే.. ప్రపంచలోనే వేంకటేశుడు అత్యధిక ధనవంతుడు. ఆయన లడ్డూను కల్తీ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ?
వైసీపీకి దర్యాప్తు చేయాలని అడిగే హక్కు లేదు. కల్తీ జరిగింది మీ పాలనలోనే.. మీరే తక్కువ కోడ్ చేసిన కంపెనీకి ఎందుకు కాంట్రాక్టు ఇచ్చారు? రూ. 320 కి నెయ్యి వస్తదో, నూనె వస్తదో తెలియదా? విచారణ పూర్తిస్థాయిలో జరగాలి. కల్తీకి ఎవరు పాల్పడ్డారు అనేది తేల్చాలి. కఠినంగా శిక్షించాలి.