– మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
విజయవాడ, మహానాడు: తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీ విషయంలో వస్తున్న వార్తలు నన్ను ఎంతగానో కలచివేశాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఈ విషయం గురించి ఫోన్లో మాట్లాడానని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తిరుమల శ్రీవారు కోట్లాది భక్తుల ఇలవేల్పు. ఆ స్వామి ప్రసాదాన్ని ప్రతి భక్తుడు పరమ పవిత్రంగా స్వీకరించటం మాత్రమే కాదు, వారి ఆత్మీయులకు కూడా శ్రీవారి ఆశీస్సులు ఈ ప్రసాదం ద్వారా లభించాలని, పంచటం పెద్దల నుంచి ఆచారంగా వస్తోంది.
ఇంతటి ఆధ్యాత్మిక వైశిష్ట్యం ఉన్న తిరుమల శ్రీవారి ప్రసాదం విషయంలో నాణ్యతతో పాటు పవిత్రత మరింత కీలకం. అలాంటి పవిత్రతకు భంగం కలిగించే చిన్నపాటి దోషమైన క్షమార్హం కాదు. ఈ నేపథ్యంలో నిజా నిజాలను నిగ్గు తేల్చి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఈ తరహా సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ముఖ్యమంత్రికి సూచించాను. ఈ విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రిని కోరాను. అందుకు ఆయన సమ్మతించారని తెలిపారు.