తెలంగాణకు 50 వేల కోట్లు
అభయహస్తం భస్మాసుర హస్తమైంది!
బీజేపీ ఎంపీ రఘునందన్ రావు
న్యూఢిల్లీ , మహానాడు: కేంద్ర బడ్జెట్పై కొందరు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని రాష్ట్రాలకు సమపాళ్లలో కేటాయింపులు జరిగాయన్నారు. గత పదేళ్లుగా ఎన్డీఏ నేతృత్వంలో అన్ని రాష్ట్రాలను సమదృష్టితో చూస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్ అధికారంలో ఉన్నా, రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నా ఆలోచన విధానం ఒకటే! జెండాలు మాత్రమే మారాయి తప్ప విధానాలు మారలేదన్నారు.
మార్పు ఏదైనా ఉందా అంటే దానం బీఆర్ఎస్ నుంచి, కాంగ్రెస్లోకి మారారు. మార్పు ఇంకేదైనా ఉందంటే కుర్చీలు మాత్రం మారాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రూ. 20 కోట్లతో కేసీఆర్ కొన్నారని, కానీ తాము బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రూ. 5 కోట్లకే కొన్నామని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియాతో చెప్పారన్నారు.
తెలంగాణ బడ్జెట్లో కేటాయింపులు ఏవి?
ప్రతి మహిళకు రూ. 2,500 ఇస్తామన్నారు. ఏడాదికి రూ. 30 వేలు అవుతుంది. ఇచ్చారా? బడ్జెట్లో కేటాయింపులు ఏవి? వరికి రూ. 500 బోనస్ ఇస్తామన్నారు. బడ్జెట్లో కేటాయింపులు ఏవి మరి? ప్రశ్నించారు. మంచి చేస్తే తాము చేశామని, చెడు జరిగితే బీజేపీ చేసిందని అంటున్నారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక రూ. 35,500 కోట్లు రుణం తెచ్చామన్నారు.
తెలంగాణకు 50 వేల కోట్లు
రంగారెడ్డి జిల్లాలో తలసరి ఆదాయం రూ. 9 లక్షల పైనే ఉంది. వికారాబాద్ జిల్లాల్లో తలసరి ఆదాయం రూ. 1 లక్ష పైన ఉంది. చేవెళ్ల నియోజకవర్గం పరిధిలో ఉన్న ఈ రెండు ప్రాంతాల మధ్య ఇంత వ్యత్యాసం ఉంది. దేశవ్యాప్తంగా చూసినా సరే ఇదే తరహా అంతరాలు ఉంటాయి. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా రూ. 26 వేల కోట్లుగా చూపించారు. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ కింద రూ. 21 వేల కోట్ల పైన చూపించారు. ఈ రెండు కలిపితే దాదాపు రూ. 50 వేల కోట్లు తెలంగాణకు వస్తున్నాయి. మరి తెలంగాణకు ఏమిచ్చారు అని ఎలా ప్రశ్నిస్తున్నారు?నిధులు వచ్చుడో, ఇద్దరం చచ్చుడో అన్నారు కదా! ఢిల్లీ జంతర్ మంతర్ రండి నిధులు వచ్చాయని తేలితే ముక్కు నేలకు రాయండి అని ఎద్దేవా చేశారు.
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చిన నిధులను ఇందిరమ్మ ఇళ్లుగా పేరు మార్చి కడుతున్నారన్నారు. తెలంగాణకు కేంద్రం ఎన్ని ఇళ్లు మంజూరు చేసిందో లెక్కలున్నాయి! ఆయుష్మాన్ భారత్ పథకం కింద రూ. 10 లక్షలకు కేంద్రం పెంచింది. దీన్నే ఆరోగ్యశ్రీ పేరు మీద ప్రచారం చేసుకుంటున్నారు. మైనారిటీల పండుగల కోసం రూ. 33 కోట్లు కేటాయించారు. మరి తెలంగాణలో హిందువులు లేరా? హిందూ పండుగలు లేవా? సెక్యులరిజం అంటే ఇదేనా? అని ప్రశ్నించారు.
మూసీ ప్రక్షాళనకు నిధులు ఇవ్వలేదు అని రేవంత్ రెడ్డి అంటున్నారు. మూసీ ప్రాజెక్టుపై డీపీఆర్ ఇచ్చావా? డీపీఆర్ లేకుండా నిధులెలా వస్తాయి? మూసీ ప్రాజెక్టును ఏటీఎం చేసుకోవాలని అనుకుంటున్నావా? ఫసల్ బీమా యోజన లో చేరతామని భట్టి చెప్పారు. ఈ పథకం కేంద్ర ప్రభుత్వానిది కాదా? కౌలు రైతులకు కూడా నిధులిస్తామన్నారు. ఒక్క రూపాయి ఇచ్చారా? మహిళలకు మీరు ఇస్తామన్నది ఏమైంది. ఏడాదికి కనీసం రూ. 30 వేల కోట్లు కేటాయించాలి. మరి బడ్జెట్లో ఎక్కడా కనిపించలేదని అన్నారు.
వికారాబాద్ జిల్లాకు ప్రత్యేక గ్రాంట్ ఏమైనా ఇచ్చారా? కేసీఆర్ సీఎంగా ఉంటే గజ్వేల్ కి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వస్తుంది! రేవంత్ రెడ్డి సీఎం అవగానే కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) ఏర్పడింది. వికారాబాద్ వుడా కాలేదు, రంగారెడ్డి రుడా కాలేదు. కొడంగల్ కి డిగ్రీ కాలేజి, నర్సింగ్ కాలేజీలు తీసుకెళ్లావు! మరి రాష్ట్రంలో 118 నియోజకవర్గాలు మీకు కనిపించలేదా? దుబ్బాక ఒక మెడికల్ కాలేజి ఇచ్చావా? ఆదిలాబాద్ కో, బోధన్ కో మెడికల్ కాలేజీ ఇచ్చావా? కొడంగల్కు రూ. 5 వేలు కోట్లు ఇచ్చుకున్న మీకు కేంద్రాన్ని ప్రశ్నించే హక్కు లేదన్నారు.
అభయహస్తం భస్మాసుర హస్తమైంది!
అభయహస్తం అన్నారు, అది భస్మాసుర హస్తమైంది. బాలికలకు ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తా అన్నాడు. ఒక్కటైనా ఇచ్చారా? అధికారం కోసం అడ్డమైన హామీలిచ్చి, అడ్డదారులు తొక్కి అడ్డమైన గడ్డి తిని, ఇప్పుడు చేస్తున్నదేంటి? నెలకో పరీక్ష అన్నారు, పరీక్షలు వాయిదా వేస్తున్నారు. ఆపన్న హస్తం కర్కశ హస్తంగా, కపట హస్తంగా మారింది! హరీశ్ రావు బడ్జెట్కి, భట్టి బడ్జెట్కి తేడా ఏముంది? ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జి అంటున్నారు. అక్కడ చదువుకున్నవారికి పేదలకు టాయిలెట్లు కట్టించాలన్న ధ్యాస లేకపోయింది!
పార్లమెంట్ ఎన్నికల్లో తోలు గుడ్డు పెట్టిన కేటీఆర్, గాడిద గుడ్డు అంటున్నారు. గుండు సున్నాలు పెట్టినోళ్లు, గాడిద గుడ్లు పెట్టినోళ్లు ఈరోజు మాట్లాడుతున్నారు! 33 జిల్లాల పేర్లను బడ్జెట్లో చదవని మీరు, కొడంగల్కు కుడా పెట్టినట్టు మిగతా పట్టణాలకు పెట్టని మీకు మాట్లాడే హక్కు లేదన్నారు. మీరంతా నై తెలంగాణ బ్యాచ్ మేమంతా జై తెలంగాణ బ్యాచ్!
ఒక్క వేలు మావైపు చూపిస్తే నాలుగు వేళ్లు మీ వైపు చూపిస్తున్నాయన్నారు. తెలంగాణ అభివృద్ధికి నరేంద్ర మోదీ కట్టుబడి ఉన్నారని స్పష్టం చేశారు.