మంగళగిరి: మంగళగిరి ప్రజల సమస్యలు తెలుసుకుని వారికి అండగా నిలిచేందుకు రాష్ట్ర మానవ వనరులు, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ చేపట్టిన ప్రజాదర్బార్ కష్టాల్లో ప్రజలకు స్వాంతన కలిగిస్తోంది.
ప్రతిరోజూ వందల సంఖ్యలో ప్రజలు ఎటువంటి ఆంక్షలు లేకుండా నేరుగా ఉండవల్లి నివాసానికి చేరుకుని యువనేతకు తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. ప్రజలు చెబుతున్న సమస్యలను సావధానంగా వింటున్న యువనేత లోకేష్ వారందరికీ మనోధైర్యాన్నిస్తూ మీకు అండగా నేనున్నానంటూ భరోసా ఇస్తున్నారు.
తమ దృష్టికి వచ్చిన సమస్యలను ఆయాశాఖల అధికారులకు పంపి నిర్ణీత సమయంలో పరిష్కరించేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటుచేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివసించే ఉండవల్లి నివాసంలోనే లోకేష్ ఉంటున్నారు. సాధారణంగా సిఎం నివాసం వద్ద కట్టుదిట్టమైన పోలీసు భద్రత ఉంటుంది.
గతంలో జగన్ నివాసం వద్ద అయితే దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ల రోడ్డునే బ్లాక్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే చంద్రబాబు నివాసం వద్ద ప్రజలకు ఎటువంటి ఆంక్షలు లేవు. వందలమంది ప్రజలు సమస్యలు చెప్పుకునేందుకు ఉండవల్లి నివాసానికి విచ్చేసినప్పటికీ ప్రతిరోజూ ఉదయం 8గంటల నుంచి లోకేష్ ప్రతిఒక్కరినీ కలుసుకుని వారి సమస్యలు వింటున్నారు.
మంగళగిరి ప్రజల కోసం తమ ఇంటి ద్వారాలు తెరిచే ఉంటాయని ఎన్నికల సమయంలో చెప్పిన మాటను ప్రజాదర్బార్ ద్వారా నిరూపిస్తున్నారు. మంగళవారం ఉదయం కూడా పెద్దసంఖ్యలో ప్రజలు లోకేష్ ను కలుసుకుని తమ సమస్యలు చెప్పుకున్నారు.
మంగళగిరికి చెందిన 70 ఏళ్ల గుండూరు వెంకట సుబ్బమ్మ తనకు పెన్షన్ వితంతు మంజూరు చేయించి ఆదుకోవాలని లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. తాడేపల్లి సుందరయ్య నగర్ కు చెందిన బి.దుర్గా ప్రసాద్ తమకు ఇంటిపట్టా ఇప్పించడంతో పాటు తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరారు.
మంగళగిరి 19వ వార్డుకు చెందిన చిల్లపల్లి వీరమ్మ తల్లిలేని తన మనవడి చదువుకు ఆర్థికసాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. తొలగించిన ఒంటరి మహిళ పెన్షన్ ను పునరుద్ధరించాలని మంగళగిరి 12వ వార్డుకు చెందిన టి.జయమణి కోరారు. చేనేత కార్మికురాలైన తనకు ఇంటి స్థలం మంజూరుచేయించి ఆదుకోవాలని మంగళగిరి కొప్పురావుకాలనీకి చెందిన గంజి లత నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. మీ-సేవ వ్యవస్థపై ఆధారపడిన వారికి తగిన న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ మీ-సేవ సంస్థ నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.
విజయవాడలో నిరసన సందర్భంగా, రాష్ట్రవ్యాప్తంగా సీపీఎస్ ఉద్యోగులపై నమోదు చేసిన 1600 కేసులను రద్దు చేయాలని ఏపీ సీపీఎస్ ఎంప్లాయిస్ అసోసిషయేన్ ప్రతినిధులు నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఆయుష్మాన్ హెల్త్ క్లినిక్ లలో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లను రెగ్యులర్ చేయడంతో పాటు, 23శాతం వేతన సవరణ, 9 నెలల జీతాల పెండింగ్ వంటి సమస్యలను పరిష్కరించాలని ఏపీఎంసీఏ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు.
బీటెక్ చదివిన తన కుమారుడికి ఉద్యోగం కల్పించాలని మంగళగిరికి చెందిన వి.దుర్గామల్లేశ్వరి కోరారు. ఆయా సమస్యలను విన్న నారా లోకేష్.. సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు.