లక్షల విలువ చేసే ఆభరణాలు మాయం
తెనాలి, మహానాడు: గుంటూరు జిల్లా తెనాలి మండలం పెదరావూరు గ్రామంలోని శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానంలో భారీ చోరీ జరిగింది. గత రాత్రి ఆలయంలోకి ప్రవేశించిన దుండగులు, గర్భాలయంలోకి ప్రవేశించి అమ్మవారి బంగారు అభయ హస్తాలు, పాదాలు, బంగారు కళ్ళు, మంగళ సూత్రాలు, బొట్టు అపహరించారు.
గర్భాలయంలో శివుని నాగాభరణాలు, పానపట్టం వంటి సుమారు పది లక్షల విలువ చేసే వెండి ఆభరణాలు అపహరణకు యత్నం చేశారు. శివుని ఆభరణాలు సుమారు 2లక్షల విలువ చేసేవి మోయలేక అక్కడే వదిలేసి పారిపోయారు. సీసీ కెమెరాలు సైతం వైర్లు ధ్వంసం చేసి హార్డ్ డిస్కులు దుండగులు ఎత్తుకెళ్లారు.
ఇదే దేవాలయంలో గతంలో రెండు సార్లు చోరీకి విఫల యత్నం చేశారు. తాజాగా మూడోసారి భారీ చోరీ జరగడంతో స్థానికులలో భయాందోళన నెలకొంది. గత మూడు రోజుల క్రితం భట్టిప్రోలు, వెల్లటూరు గ్రామాలతో సహా కృష్ణాజిల్లాలోని పలు ఆలయాల్లో చోరీ చేసిన ముఠా పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు.