Mahanaadu-Logo-PNG-Large

ఎమ్మెల్సీ విజయం తెలంగాణ అమరులకు అంకితం

-కేసీఆర్‌కు కానుక ఇస్తున్నాం..ఓటమి రేవంత్‌కు చెంపపెట్టు
-మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

మహబూబ్‌నగర్‌: స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయం సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్దం పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్‌ఎస్‌ పార్టీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో అద్భుతమైన మెజారిటీతో గెలిచిందని, ఇందుకు కారణమైన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు శుభాకాంక్షలు చెప్పారు. ఈ విజయాన్ని తెలంగాణ అమరవీరులకు అంకితం ఇస్తున్నామని, ఉమ్మడి జిల్లా నుంచి మా అధినేత కేసీఆర్‌కు మేము ఇచ్చే కానుక అని పేర్కొన్నారు. నవీన్‌కుమార్‌రెడ్డి ఎమ్మెల్సీ గెలుపు కొత్త బాటకు దారి తీస్తుందని వ్యాఖ్యానించారు. బలం లేకున్నా గతంలో రేవంత్‌ ఎమ్మెల్సీగా గెలిచినట్లు గెలవాలనుకున్నాడు. ఈ ఓటమి రేవంత్‌ రెడ్డికి చెంప పెట్టు అని వ్యాఖ్యానించారు.

నమ్మి అవకాశమిచ్చినందుకు ధన్యవాదాలు: ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌ రెడ్డి
మా మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ రోజు.. సీఎం జిల్లాలో బీఆర్‌ ఎస్‌ ప్రజాప్రతినిధులు నాకు విజయం అందించారు. విజయం కోసం పని చేసిన వారందరికీ కృతజ్ఞతలు. మహబూబ్‌ నగర్‌ జిల్లా కేసీఆర్‌ అడ్డా అని పాలమూరు జిల్లా నిరూపించింది.