బీజేపీ కార్యకర్తలకు మోదీ బర్త్ డే ‘తోఫా’

– ఎంపీ ఎన్నికల్లో 80 శాతానికిపైగా ఓట్లు నమోదు చేసినోళ్లకు బండి ‘ప్రజాస్వామ్య కానుక’
– కరీంనగర్ ఎంపీ సెగ్మెంట్ లోని 222 పోలింగ్ బూత్ కమిటీలను ఘనంగా సన్మానించిన కేంద్ర మంత్రి
– స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అత్యధిక పోలింగ్ నమోదు చేయించాలని పిలుపు
– దేశంలోనే తొలిసారి కొత్త సాంప్రదాయానికి తెరదీసిన బండి సంజయ్

కరీంనగర్ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుట్టిన రోజు వేడుకలు కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఈరోజు బీజేపీ కార్యకర్తలకు ‘ప్రజాస్వామ్య కానుక’ను అందించారు. అదేమిటంటే మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో 80 శాతం అంతకంటే ఎక్కువ పోలింగ్ ను నమోదు చేయించిన పోలింగ్ బూత్ కమిటీలను గుర్తించి ఘనంగా సన్మాంచారు. నగదు ప్రోత్సహకాన్ని సైతం అందించారు.

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ లో గత కొంత కాలంగా ఎన్నికల పోలింగ్ శాతం నానాటికీ పడిపోతుండటంతో ఒకవైపు ఎన్నికల సంఘం ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అనేక చర్యలు చేపట్టింది. అయినప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదు. హైదరాబాద్, సికింద్రాబాద్ సహా నగరాలు, పట్టణాల్లో పోలింగ్ శాతం 50, 60 శాతం దాటడం లేదు.

ఇది గమనించిన బండి సంజయ్ మొన్నటి ఎంపీ ఎన్నికల సందర్భంగా ‘‘మీకు నచ్చితే ఏ పార్టీకైనా ఓటేయండి. అభ్యంతరం లేదు. కానీ తప్పనిసరిగా ఓటు మాత్రం వేయండి.’ అని పిలుపునిచ్చారు. అదే సమయంలో బీజేపీ కార్యకర్తలకు బంపర్ ఆఫర్ ప్రకటించారు.

‘‘నా పార్లమెంట్ నియోజకవర్గంలో పార్టీ గుర్తులతో సంబంధం లేకుండా ఏ పోలింగ్ బూత్ లోనైతే 80 శాతం, అంతకుమించి ఓట్లు పోలవుతాయనే ఆ పోలింగ్ బూత్ కమిటీ బాధ్యులకు ఒక్కొక్కరికి రూ.10 వేల నగదు ప్రోత్సాహకంతోపాటు ఘనంగా సత్కరిస్తా’’అని ప్రకటించారు.

ఈ నేపథ్యలో ఎన్నికల ఫలితాల అనంతరం ఏ పోలింగ్ బూత్ లో 80 శాతనికిపైగా ఓట్లు పోలయ్యాయనే వివరాలను సేకరించారు. ఒకటి రెండు కాదు… ఏకంగా 222 పోలింగ్ బూత్ లలో ఏకంగా 80 శాతం అంతకంటే ఎక్కువ ఓటింగ్ నమోదైనట్లు జాబితా రూపొందించారు. కొన్ని పోలింగ్ బూత్ లలో బీజేపీకి తక్కువ ఓట్లు పోలైనట్లు గుర్తించినప్పటికీ, వాటిని కూడా ఈ జాబితాలో చేర్చారు.

నరేంద్ర మోదీ జన్మదిన వేడుకల సందర్భంగా బీజేపీ పక్షం రోజుల పాటు ‘సేవా పఖ్వాడ’ పేరిట అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈరోజు సాయంత్రం కరీంనగర్ లోని ఈఎన్ గార్డెన్ లో ఆయా పోలింగ్ బూత్ కమిటీ సభ్యులందరినీ పిలిపించి వారిని ఘనంగా సన్మానించారు.

నగదు బహుమతి అందజేసి ప్రోత్సహించారు. బీజేపీ కార్యకర్తల కష్టం ఫలితంగానే తన పార్లమెంట్ పరిధిలో 222 పోలింగ్ కేంద్రాల్లో అత్యధిక ఓట్లు పోలయ్యాయన్నారు. గత ఎన్నికల్లో తనను ఓడించాలని కేసీఆర్, రేవంత్ రెడ్డి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎక్కువసార్లు పర్యటించారని, అయినప్పటికీ కార్యకర్తల శ్రమ ఫలితంగా 2 లక్షల 20 వేలకుపైగా మెజారిటీ వచ్చిందన్నారు.

వాస్తవానికి దేశంలో ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ కూడా పోలింగ్ శాతం పెంపుపై పెద్దగా ద్రుష్టి సారించలేదు. తమ పార్టీ అభ్యర్ధి గెలిస్తే చాలనే భావనతో ప్రచారం చేసిన సందర్భాలే అనేకం ఉన్నాయి. కానీ ఏ పార్టీకైనా ఓట్లేయండి. కానీ ఓటేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అంటూ బండి సంజయ్ పిలుపునివ్వడమే కాకుండా అత్యధిక ఓటింగ్ నమోదు చేయించిన పోలింగ్ బూత్ కమిటీలను నగదు ప్రోత్సహంతో ఘనంగా సన్మానించి సరికొత్త సాంప్రదాయానికి తెరదీశారు.

భవిష్యత్తులోనూ జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ మీ పోలింగ్ బూత్ పరిధిలో అత్యధిక ఓట్లు పోలయ్యేలా చేసి కరీంనగర్ పార్లమెంట్ ను దేశంలోనే అగ్రభాగాన నిలపాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. అంతకుముందు బీజేపీ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మోదీ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని బండి సంజయ్ ప్రారంభించారు. పలువురు బీజేపీ కార్యకర్తలు స్వచ్ఛందంగా రక్తదాన శిబిరానికి హాజరై రక్తదానం చేశారు.