– పరిశ్రమదారులకు అనువుగా టైలర్ మేడ్ పాలసీ రూపకల్పన
– 20లక్షల ఉద్యోగాల కల్పనలో ఐటి, ఎలక్ట్రానిక్స్ రంగాలదే కీలకపాత్ర
– ఐసీఈఏ సమావేశంలో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్
న్యూఢిల్లీ: ఐటి, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో కేవలం ఇతర రాష్ట్రాలతో మాత్రమే కాకుండా, ఇతర దేశాలతో కూడా తాము పోటీపడుతున్నట్టు రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఇండియన్ సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) ప్రతినిధులతో మంత్రి లోకేష్ సోమవారం న్యూడిల్లీలో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఐసిఈఎ చైర్మన్ పంకజ్ మహీంద్ర అధ్యక్షత వహించారు. ఆంధ్రప్రదేశ్ ను ఎలక్ట్రానిక్స్ హబ్ గా మార్చడానికి చేపడుతున్న చర్యలు, రాష్ట్రంలో నెలకొన్నఅనుకూలతలపై పరిశ్రమదారులకు మంత్రి లోకేష్ విశదీకరించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… దేశంలో పేరెన్నిగన్న పరిశ్రమదారులతో ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటుచేశామని, తరచూ వారితో సమావేశమై పరిశ్రమదారులకు ఎదురయ్యే విధానపరమైన సమస్యలు, సవాళ్లను అధిగమించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో రాబోయే అయిదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు సాధించడంలో ఐటి, ఎలక్ట్రానిక్ రంగాలు కీలకపాత్ర పోషిస్తాయని తెలిపారు. ఐటి, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమదారుల కోసం టైలర్ మేడ్ పాలసీలను రూపొందిస్తామని అన్నారు.
ఏపీలో ఇండస్ట్రీ ఫ్రెండ్లీ విధానాల అమలు
ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు దేశంలోనే అత్యంత సులభతరమైన ఇండస్ట్రీ ఫ్రెండ్లీ పాలసీలను అమలు చేస్తోంది. అన్నిరకాల పరిశ్రమలకు అనువైన ఎకో సిస్టమ్ ఏర్పాటుచేస్తున్నాం. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బజినెస్ అనే నినాదంతో మేము ముందుకు సాగుతున్నాం. 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న చంద్రబాబు నాయుడు దూరదృష్టి గల నాయకత్వంలో అభివృద్ధి దిశగా ఏపీ వేగంగా ముందుకు సాగుతోంది. పరిశ్రమలకు వేగవంతమైన అనుమతుల కోసం ఈడీబీని పునరుద్ధరించాం, సరైన ప్రాతిపాదనలతో వచ్చేవారికి తగిన ప్రోత్సాహకాలను అందించడానికి సిద్ధంగా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ను ఇన్నోవేషన్, టెక్నాలజీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పవర్హౌస్గా మార్చడంపై దృష్టి సారించాం. ముఖ్యంగా విశాఖపట్నాన్ని ఐటి పవర్ హౌస్ గా, అంతర్జాతీయ ఎఐ రాజధానిగా తీర్చిదిద్దడానికి కృతనిశ్చయంతో ఉన్నాం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధికి ఎఐ, ఎమర్జింగ్ టెక్నాలజీస్ యూనివర్సిటీ, డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు.
తిరుపతిని ఎలక్ట్రానిక్స్ హబ్ గా తీర్చిదిద్దుతాం
తిరుపతిని ఎలక్ట్రానిక్స్ హబ్ గా మార్చడానికి పరిశ్రమదారులు సహకారాన్ని కోరుతున్నాం. ఇప్పటికే ప్రపంచంలో పేరెన్నిగన్న డిక్సన్, డైకిన్, టీసీఎల్ కంపెనీలు తమ యూనిట్లను ఏర్పాటు చేశాయి. అనంతపురంలో కియా మోటార్స్ ఇప్పటికే పనిచేస్తోంది, అనంతపురం, కర్నూలు జిల్లాలను ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ, ఈవీ కీలక కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. అమెరికాలో వాషింగ్టన్ మాదిరిగా ఏపీ పరిపాలన కేంద్రం అమరావతిని తీర్చిదిద్దడంపై మా ప్రభుత్వం దృష్టిసారించినట్టు మంత్రి లోకేష్ చెప్పారు. ఈ సందర్భంగా పరిశ్రమదారులు మాట్లాడుతూ… భారత్ లో మొబైల్ తయారీరంగ అభివృద్ధికి గల అవకాశాలు, అందులో పీఎల్ఐ పాత్రపై గణాంకాలతో వివరించారు. దేశవ్యాప్తంగా ఏసీ తయారీ క్లస్టర్లను ఏర్పాటు చేయాల్సి ఉందని, వాటి అవసరం పెరుగుతోందని చెప్పారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో మహిళా శ్రామికశక్తి పాత్ర, ప్రాథమిక సమస్యలను కూడా మంత్రికి తెలిపారు. అన్నివిధాలా అనువైన వాతావరణంతో వ్యూహాత్మక పెట్టుబడి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ముందుకు సాగుతోంది. ఏపీ అభివృద్ధికి మీ వంతు, సహాయ, సహకారాలు అందించాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తిచేశారు.