జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ఆన్ లైన్ దరఖాస్తుకు వారం రోజుల గడువు

• నేటి నుండి 26 ఫిబ్రవరి, 2024 వరకు దరఖాస్తుల స్వీకరణ
– సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి

వివిధ కారణాలతో ఇళ్లస్థలాలకు దరఖాస్తు చేసుకోని అర్హులైన జర్నలిస్టులకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునేందుకు మరో వారం రోజుల గడువు కేటాయిస్తున్నట్లు సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నేటి (19 ఫిబ్రవరి, 2024) నుండి 26 ఫిబ్రవరి, 2024 (సోమవారం) వరకు అర్హులైన జర్నలిస్టుల నుండి వెబ్ సైట్ లో దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఆయన వెల్లడించారు.

ఇప్పటికే 6 జనవరి, 2024 వరకు అంటే నిర్ణీత గడువులోగా ఆన్ లైన్ లో తమ వివరాలను నమోదు చేసుకోని వారికి మరియు నమోదు చేసుకున్నప్పటికీ సబ్మిట్ కొట్టని వారికి ఆయా జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాల విజ్ఞప్తి మేరకు ఈ అవకాశం కల్పించినట్లు ఆయన తెలిపారు. జర్నలిస్టులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని 26 ఫిబ్రవరి, 2024 వరకు నిర్ణీత గడువులోగా తమ వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేసుకోవాలని సూచించారు.