అబద్ధాల్లో రేవంత్‌కు ఆస్కార్‌ ఇవ్వాలి

-మెదక్‌ అభివృద్ధి నీ కళ్లకు కనిపించలేదా?
-ఏడుపాయల అమ్మవారి ఉసురు తగులుతుంది
-నా ఎత్తుతో ఏం పని..రైతుల గురించి ఆలోచించు
-మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు ఫైర్‌

మెదక్‌, మహానాడు: మెదక్‌ బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో ఆదివారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు మీడియా సమావేశం నిర్వహించారు. మెదక్‌ను జిల్లా చేస్తామని చెప్పి ఇందిరాగాంధీ మోసం చేస్తే ఆ కలను నెరవేర్చింది కేసీఆర్‌ అని పేర్కొన్నారు. రేవంత్‌ చెప్పవన్నీ అబద్ధాలే. మెదక్‌ రాందాస్‌ చౌరస్తా మీదుగా నామినేషనకు వెళ్లావు..అక్కడ అభివృద్ధి కనిపించలేదా? నువ్వు నామినేషన్‌కు వెళ్లిన కలెక్టరేట్‌ కట్టింది కేసీఆర్‌ కాదు…నిన్ను మెదక్‌కు రప్పించిన ఘనత కేసీఆర్‌దని వ్యాఖ్యానించారు. మెదక్‌కు రైలు తెచ్చింది కేసీఆర్‌..వంద కోట్లు ఖర్చు చేసి లైన్‌ తెచ్చాడు. మూడు జిల్లాలు చేసి మూడు మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేశాడు.

గోదావరి నీళ్లు తెచ్చి చిట్టచివరి ఆయ కట్టుకు నీళ్లిచ్చాడు. ఇంత చేసినా కేసీఆర్‌ ఏమీ చేయలేదంటున్నావు. ఏడుపాయల అమ్మవారికి కేసీఆర్‌ వందకోట్లు ఇస్తే వాపసు తీసుకున్నావు. నీకు అమ్మవారి ఉసురు తగులుతుంది. అబద్ధా లు ఆడటంలో రేవంత్‌కు ఆస్కార్‌ అవార్డు ఇవ్వాలి. ఉరికిచ్చి కొడ్తా..పేగులు మెడలో వేసు కుంటా, బొందపెడ్తా, మానవ బాంబునవుతా అంటున్నావు… ఇవేనా సీఎం మాట్లాడ్లాల్సింది? హామీల గురించి అడిగితే హెచ్చరిస్తున్నావు కేసులు పెడుతున్నావు. రుణమాఫీ చేస్తానని చేయనందుకు 60 లక్షల మంది రైతులకు క్షమాపణ చెప్పు. మా అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని లోకల్‌ కాదంటున్నావు, ఆయన ఇక్కడే స్థిరపడిన ఓటర్‌. కొడంగల్‌లో ఓడిపోయి మల్కాజిగిరికి పోయింది నువ్వు. నా ఎత్తుతో ఏం పని? రైతుల సమస్యలు పరిష్కరించు..ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు 18 రోజులుగా వేచిచూస్తున్నా ప్రభుత్వం కొనడం లేదన్నారు. మీ పార్టీ నేతలు వీహెచ్‌, మోత్కుపల్లిలనే నువ్వు కలవడం లేదు. ఇదేనా ప్రజా పాలన? హామీలు కోసం బాండు రాసిచ్చి బాండ్ల విలువ కూడా తీశావు. మెదక్‌లో గెలిచేది బీఆర్‌ఎస్సేనని స్పష్టం చేశారు.