నిరుద్యోగులకు మా సంపూర్ణ మద్దతు

ఈటల రాజేందర్

హైదరాబాద్: కెసిఆర్ ప్రభుత్వంలో ఉద్యోగాలు రావు వచ్చినా బ్రోకర్లకే పట్టం కడుతూ ఉద్యోగాలు అమ్ముకుంటారు అని చెప్పిన రేవంత్ రెడ్డి.. ప్రభుత్వం రాగానే రెండు లక్షల ఉద్యోగాల క్యాలెండర్ ప్రకటిస్తా అని చెప్పారు కానీ ఏం చేయలేదు. నిరుద్యోగుల్లో అలజడి నెలకొని ఉన్నది. చదువుకున్న వారంతా భగ్గుమంటున్నారు.

యువత రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించింది. అవిశ్వాసం ప్రకటించింది. ఒక ఉద్యోగానికి ఇంకో ఉద్యోగ పరీక్షకు మధ్య గ్యాప్ ఇవ్వండి అని అడుగుతుంటే వారిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు. మేము చచ్చిపోతున్న ఈ ప్రభుత్వం పట్టించుకో వడం లేదు.. మీరైనా మా రెస్క్యూకి రండి అని వందల మంది ఫోన్లు చేస్తున్నారు. ఆరు నెలల్లోనే భ్రమలు తొలగిపోయి ఈ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు నిద్రపోమని నిరుద్యోగులు శపథం చేస్తున్నారు. నిరుద్యోగులు చేస్తున్న పోరాటానికి మా సంపూర్ణ మద్దతు ఉంటుంది అని ఈటల రాజేందర్ ప్రకటించారు.