పాపం.. లచ్చమ్మ ఫీలయిందట!

– తొలి ఫైలుపై సంతకానికి మంత్రి నారాయణ నో
– చిన్నబుచ్చుకున్న ఏఐఎస్ అధికారి శ్రీలక్ష్మి
– ఫలించని ఓవర్ యాక్షన్
– ఆమెకు ఫైళ్లు పంపవద్దని సర్కారు ఆదేశం
( మా
ర్తి సుబ్రహ్మణ్యం)

ఆమె ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి. నిబంధనల ప్రకారం పనిచేస్తే కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ వరకూ వెళ్లేంత రాజయోగం. కాలం ఖర్మం కలసివస్తే.. జగన్నయ్య మళ్లీ సీఎం అయి ఉంటే ఆమె చీఫ్ సెక్రటరీ అయ్యేది. అసలు పాపం జగన్ సేవ కోసం ఆమె అప్పుడే తెగ పరితపించింది.

తెలంగాణ క్యాడర్ నుంచి ఏపీకి వచ్చేందుకు, ఢిల్లీలో నెంబర్ టూ విజయసాయిరెడ్డి చుట్టూ ప్రదక్షణలు చేశారని.. ఆ క్రమంలో ఆమె ఢిల్లీలోని ఏపీ భవన్‌లో తిష్టవేస్తే, ఎక్కువకాలం అక్కడ తిష్టవేసేందుకు నిబంధనలు వర్తించవని, భవన్ అధికారులు నిర్మొహమాటంగా చెప్పారన్నది అప్పట్లో సోషల్‌మీడియాలో రన్నయిన ఒక స్టోరీ. జగన్ ఢిల్లీకి వెళ్లినప్పుడల్లా.. విజయసాయిరెడ్డితో కలసి వెళ్లిన ఫొటోలు కూడా బాగా వైరల్ అయ్యాయి. అది ఇంకో కథ.

సరే ఎట్టకేలకు జగనయ్య కరుణించి, తెలంగాణ ‘బ్రో’ కేసీఆర్‌తో మాట్లాడి, ఆమెను ఏపీని తీసుకువచ్చారు. ఇక ఆ తర్వాత ఆమె హవా మామూలుగా లేదు. మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఆమె వైభోగం చెప్పనలవి కాదు. ఎక్కడున్నా ఆమె స్టైలే వేరు. అది బహిరంగ రహస్యం.

‘నీతి-నిజాయితీకి నిలువుటద్దై’మెన ఆమె, అవినీతికి కొన్ని వందలమీటర్ల దూరంలో ఉంటారు..ట. డబ్బులకు-లంచాలకు ఏమాత్రం లొంగని అధికారి..ట. వైఎస్ ఉన్నప్పుడు కూడా, ఆమెను అకారణంగా జైలుపాలు చేశారు..ట. ఏదైనా సరే నిబంధనల ప్రకారమే చేస్తారు.. ట. అవినీతి విషయంలో ‘చాలా పద్ధతి’గా ఉంటారట. ఇవన్నీ.. ఆమెను బలపరిచే వారి.. ‘ట’..లు!

అలాంటి అధికారికి పాపం అవమానం ఎదురయింది. అన్యాయం కదూ? అదేమిటో చూద్దాం. నెల్లూరు ఎమ్మెల్యే నారాయణ, మున్సిపల్ శాఖ మంత్రిగా సచివాలయంలోని తన చాంబరులో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆ శాఖ అధిపతి కాబట్టి శ్రీలక్ష్మి కూడా ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. పదవీ బాధ్యతలు స్వీకరించే ప్రతి మంత్రీ ఆరోజు ఏదో ఒక ఫైలుపై సంతకం చేయడం ఒక సంప్రదాయం.

శ్రీలక్ష్మి కూడా ఆ ప్రకారమే ఒక ఫైలు తీసుకువచ్చి, నారాయణ ముందు పెట్టారు. అయితే ‘మహిళలను గౌరవించే’ నారాయణ మాత్రం.. అలాంటివేమీ అవసరం లేదనడంతో, శ్రీలక్ష్మి తన చేతిలోని ఫైలును పక్కనున్న అధికారికి ఇచ్చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
అసలు శ్రీలక్ష్మికి ఎలాంటి ఫైలు పంపవద్దన్నది, పైనుంచి వచ్చిన ఆదేశాలట. అత్యాశ-పోస్టింగులకు కక్కుర్తి పడి, పాలకులకు సాగలబడితే ఇలాంటి అవమానాలే ఎదురవుతాయంటూ నెటి జన్లు కామెంట్లు పెడుతున్నారు.