• విజయానంతరం అంజన్నకు ప్రత్యేక పూజలు
జగిత్యాల: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం తమ ఇలవేల్పు కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. అంజన్నకు మొక్కులు చెల్లించుకున్నారు. గత ఏడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన వారాహి విజయ యాత్రకు ముందు వారాహి వాహనానికి కొండగట్టులో ప్రత్యేక పూజలు నిర్వహించిన విషయం విదితమే.
సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం అనంతరం తెలంగాణ, జగిత్యాల జిల్లాలోని కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఆలయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ కి ఆలయ ఈవో చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
ప్రధాన స్థానాచార్యులు కపీంద్ర స్వామి పవన్ కళ్యాణ్ కి సంప్రదాయబద్దంగా తలపాగ చుట్టి ఆలయంలోకి ఆహ్వానించారు. అనంతరం శ్రీ ఆంజనేయస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంజనేయస్వామికి ఇరు వైపులా ఉన్న శ్రీ వెంకటేశ్వరస్వామి, శ్రీ లక్ష్మీ అమ్మవార్లకు అర్చనలు చేసిన అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనాలు అందించి, స్వామి వారి ప్రసాదం అందచేశారు.