– మరో భూ కబ్జా భాగోతంపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు
– మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి, అతని సోదరుడు భూమి కబ్జా… ఆపై హత్యాయత్నం
– పంటను బూడిద చేసి చంపుతామంటూ బెదిరింపులు
– బోరుమంటూ మహిళ ఫిర్యాదు
– టీడీపీకి అనూకూలంగా ఉన్నారని ఇంటిపై మూకుమ్మడి దాడి… అక్రమ కేసులు
– కొడుకు కనిపించలేదని ఫిర్యాదు చేస్తే పట్టించుకోని పోలీసులు
– సర్టిఫికేట్ల కోసం వెళితే ఆఫీసుల్లో సాయంత్రం వరకు కూర్చోబెట్టిన అధికారులు
మంగళగిరి, మహానాడు: పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని రామా టాకీస్ లైన్ లో 1,161.6 చదరపు గజాల స్థలాన్ని తాటిపర్తి సాంబశివారెడ్డి, బండారు శ్రీనివాసరావులు కలిసి కొనుగోలు చేసి రిజిస్ట్రర్ చేసుకోగా.. ఆ స్థలాన్ని నాటి ఎమ్మెల్యే, ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే అయిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని తమ్ముడు పిన్నెల్లి వెంకట రామిరెడ్డిలు కబ్జా చేశారని తాటిపర్తి సాంబశివారెడ్డి బోరుమన్నారు. ఇక్కడి తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ జరిగింది. సాంబశివారెడ్డి ఫిర్యాదు చేస్తూ… వారు తనను బెదిరించి తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారని… ఆ స్థలానికి తప్పుడు పత్రాలు సృష్టించారని.. తనను కొట్టి బలవంతంగా రిజిస్ట్రర్ చేయించుకున్నారని… వారిపై కఠిన చర్యలు తీసుకుని.. బలవంతంగా రిజిస్ట్రర్ చేయించకున్న రిజిస్ట్రేషన్ ను రద్దు చేయాలని గ్రీవెన్స్లో పాల్గొన్న జీవీ రెడ్డి, వైకుంఠం ప్రభాకర్ చౌదరి, బుచ్చిరాంప్రసాద్ లకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా బాధితుడి బాధను విన్న నేతలు వెంటనే రెవెన్యూ అధికారులకు ఫోన్ చేసి విచారించి బాధితుడికి న్యాయం చేయాలని ఆదేశించారు. వచ్చిన అర్జీదారుల నుండి వినతులు స్వీకరించారు
• తాము కొనుగోలు చేసిన భూమిని బాగుచేసుకొనేందుకు 20 లక్షల వరకు ఖర్చు పెట్టి అరటి తోట వేసుకోగా.. రాజంపేట మండలం పోలి గ్రామానికి చెందిన వైసీపీ నేతలు మాలక్కాలయ మురళీమోహన్ రెడ్డి, అతని అనుచరులు తోటలోకి వచ్చి పంటను, బోరు పైపులను ధ్వంసం చేసి నిప్పు పెట్టారని.. పంటను బోర్లను బూడిద చేశారని అన్నమయ్య జిల్లా రాజంపేట కు చెందిన భోనం అనురాధ ఫిర్యాదు చేశారు. ఫెన్సింగ్ రాళ్లను ధ్వంసం చేసి తమ భూమిని కబ్జా చేశారని… ఆన్ లైన్ లో పేర్లు మార్చారని.. ప్రశ్నిస్తే.. చంపుతామని బెదిరిస్తున్నారని, వారి నుండి తనకు ప్రాణహాణి ఉందని.. పంటను నాశనం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుని.. తన భూమి తనకు దక్కేలా చూడాలని ఆమె కోరారు.
• టీడీపీ స్టేట్ లీగల్ సెల్ సెక్రటరీ పి.లక్ష్మన్న విజ్ఞప్తి చేస్తూ.. తాను కొనుగోలు చేసిన భూమిని మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి, అతని సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి తో పాటు ఆయన అనుచరులు కబ్జా చేసి రాళ్లు పాతారని.. తనను చంపేదుకు చూశారని.. వారి నుండి తనను కాపాడి.. భూమిని కబ్జా నుండి విడిపించాలని గ్రీవెన్స్ కార్యక్రమంలో నేతల ముందు వేడుకున్నారు.
• తనపేరు మురళి అని, తనది విజయవాడని తనకు ఇద్దరు కుమారులు ఉన్నారని.. తన పెద్ద కొడుకు మోహిత్ తేజ 2023 నవవంబర్ 1న 1.15 నిమిషాల సమయంలో ఇంటి నుండి బయటకు వెళ్ళి తిరిగి రాలేదని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని.. ఎవరైనా కిడ్నాప్ చేశారేమోనన్న అనుమానం ఉందని.. దయ చేసి తన కొడుకు మిస్సింగ్ పై విచారించి పట్టుకోవాలని గ్రీవెన్స్ లో నేతల ముందు మురళి కన్నీరు మున్నీరయ్యారు.
• తాము టీడీపీకి అనుకూలంగా ఉండటంతో మొన్న జరిగిన ఎలక్షన్ లో తమ ఇళ్లపైకి వచ్చి వృద్ధులు, పిల్లలు అని కూడా చూడకుండా.. రాడ్లు, కర్రలతో కొట్టారని… కొట్టడమే కాకుండా అన్యాయంగా ఎస్సీ, ఎస్టీ అక్రమ కేసులుపెట్టారని.. రౌడీ షీట్ లు ఓపెన్ చేశారని.. పోలీసులు వైసీపీ నేతలకు తొత్తులగా మారి తమపై అక్రమ కేసులు పెట్టారని వాటిని తొలగించాలని సత్తెనపల్లి మండలం భట్లూరి గ్రామానికి చెందిన మల్లికార్జునరావు గ్రీవెన్స్ లో వేడుకున్నారు.
• అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం యార్లగడ్డ గ్రామానికి చెందిన పోకూరి సుబ్బయ్య, వెకంటయ్య, నల్లగండ్ల సుబ్బయ్యలు విజ్ఞప్తి చేస్తూ.. తమకు వారసత్వంగా వచ్చిన భూమిని చెన్నూరు నాగేంద్ర, చెన్నూరు శినయ్య, చెన్నూరు వెంకటరమణ, చెన్నూరు నరసింహులు ఫేక్ డాక్యూమెంట్ల సృష్టించి అమ్మేశారని.. ఈ అక్రమాలపై ఎంక్వైరీ చేసి తమకు న్యాయం చేయాలని వారు వేడుకున్నారు.
• సత్యసాయి జిల్లా కుర్లి తలుపుల మండలం ఈరప్పగారిపల్లికి చెందిన బండారు శ్రీరాములు విజ్ఞప్తి చేస్తూ.. తన తండ్రి నుండి వారసత్వంగా వచ్చిన భూమిని గొల్ల నారాయణ, ఈరగాని గంగన్న, ఈరగాని వెంకట రమణలు ఆక్రమించుకున్నారని తమ భూమిని తమకు ఇప్పించి ఆదుకోవాలని నేతల ముందు వేడుకున్నారు
• ఏపీలో హోంగార్డులుగా పనిచేస్తున్న తమకు పోలీసు నియామకాల్లో అన్యాయం జరుగుతుందని.. అర్హత ఉన్నా.. హోంగార్డులుగానే మిగిలిపోవాల్సి వస్తోందని.. హోంగార్డు నియామకాల్లో ఎత్తు 165 సెం.మీ. కొలుస్తుంటే పోలీసు నియామకాల్లో 167.6 సెం.మీ. కావాలంటున్నారని.. దాంతో 25% కానిస్టేబుల్ నియామకాల్లో తమకు ఉన్న ప్రత్యేక కోటాలో హైట్ కారణంగా వాటిని పొందలేకపోతున్నామని.. తమకు హైట్ పరిమితిని 165కు కుదించి న్యాయం చేయాలని వారు వేడుకున్నారు.
• పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం రామాపురం గ్రామానికి చెందిన కోటా హరిప్రసాద్ విజ్ఞప్తి చేస్తూ.. తాము పూర్వికుల నుండి సాగు చేసుకుంటున్న భూమిని తమకు తెలియకుండా గత ప్రభుత్వం రెండు సంవత్సరాల క్రితం ఇతరులకు కేటాయించిందని… ఆ భూమి నేటికీ తమ ఆధీనంలోనే ఉందని.. పాస్ పుస్తకాలు కూడా ఉన్నాయని.. తమకు న్యాయం చేయాలని వేడుకున్నాడు.
• విజయనగరంలోని జీజీహెచ్, జీఎంసీలలో 2023 లో ఆప్కాస్ ద్వారా నియామకమైన ఉద్యోగులకు 12 నెలలు అయినా జీతాలు ఇవ్వలేదని, దాంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని.. దయ ఉంచి తమ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి జీతాలు వచ్చేలా చేయాలని వారు వేడుకున్నారు. అలాగే నంద్యాల మెడికల్ కాలేజీలో అవుట్ సోర్సింగ్ ద్వారా రిక్రూట్ మెంట్ అయ్యి విధులు నిర్వహిస్తున్న తమకు 21 నెలల నుండి జీతాలు అందడంలేదని.. జీతాలు ఇచ్చి ఆర్థిక కష్టాల నుండి బయట పడేయాలని వారు వేడుకున్నారు. అలాగే డిస్ట్రిక్ సెలక్షన్ కమిటీద్వారా ఎన్నికై ఎఫ్ఎన్వో, ఎంఎన్వో, ఎస్ఏడబ్ల్యులుగా నియమించమడి పీహెచ్సీ, కేజీహెచ్లలో పనిచేస్తున్న 54 మందికి 12 నెలలు గా జీతాలు అందడంలేదని ఫిర్యాదు చేశారు.
• బాపట్ల జిల్లా చీరాల మున్సిపాలిటీ పేరాలకు చెందిన కె. ఆనందబాబు విజ్ఞప్తి చేస్తూ.. తన అన్న కుమారుడు మానసిక వికలాంగుడని.. పిల్లాడి తల్లిదండ్రలు ఇద్దరు మరణించారని.. 2020 వరకు ఎన్టీఆర్ వికలాంగ భరోసా పింఛన్ వచ్చేదని.. తరువాత తొలగించారని.. తిరిగి తన అన్నకొడుక్కి వికలాంగ పింఛన్ మంజూరు చేయించాలని అభ్యర్థించారు.
• తాము ఇల్లు కొనుగోలు చేసి రిజస్టర్ చేసుకున్న ఇంటిని ఖాళీ చేయమంటే ఖాళీచేయకుండా తమనే బెదిరిస్తున్నారని.. బిల్డింగు అప్పజెప్పకుండా కాలయాపన చేస్తూ.. దిక్కున్నచోట చెప్పుకోండి అంటూ ఇబ్బందిపెడుతున్నారని.. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ లబ్బీపేట పైడయ్య వీధికి చెందిన వుయ్యూరు శ్రీవాని గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు.
• బాపట్ల జిల్లా, మార్టూరు మండలం తాటివారిపాలెంకు చెందిన నాగరాజు విజ్ఞప్తి చేస్తూ.. తుళ్లూరు మండలంలో పనికి వెళ్లగా విద్యుత్ వైర్లు తగిలి రెండు చేతులు పోయాయని.. కాళ్ల వేళ్లు తొలగించారని గత ప్రభుత్వంలో న్యాయం కోసం అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోలేదని.. తనకు పింఛన్ ఇచ్చి ఆదుకోవాలని వేడుకున్నారు.
• కర్నూలు జిల్లా ఆలూరు మండలం ఆనేకుర్తి గ్రామానికి చెందిన సర్పంచ్, గ్రామ ప్రజలు నేడు గ్రీవెన్స్ లో విజ్ఞప్తి చేస్తూ.. వైసీసీ నేతలు భీరప్ప, దేవాలయానికి సంబంధించిన అర్చకుడు నకిలీ పాస్ బుక్ లు సృష్టించి దేవాలయ భూమి 9.66 సెంట్లను విక్రయించారని.. దీనిపై మండల అధికారులకు కూడా ఫిర్యాదు చేశామని.. ఆ విక్రయాదులను రద్దు చేసి భూమిని ఎండోమెంట్ వారు స్వాధీనం చేసుకోవాలని నేతలకు వినతి అందించారు
• ఉమ్మడి విశాఖ జిల్లా అరకు గిరిజన తెగకు చెందిన 10 కుటుంబాలు జివనోపాధి నిమిత్తం విశాఖకు 25 సంవత్సరాల క్రితం రాగా.. తమకు ఇళ్లు లేకపోవడంతో.. టీడీపీ ప్రభుత్వం హయాంలో 8 వ వార్డులో కార్పొరేటర్ మద్దాల వెంకటరత్నరెడ్డి.. ఒక్కో కుటుంబానికి 60 గజాల చొప్పున స్థలం కేటాయించారని, ఆ స్థలాన్ని గత వైసీపీ ప్రభుత్వంలో నేతలు ఆక్రమించుకోవాలని చూశారని.. తమను మానసికంగా హింసించారని.. తమకు ఇళ్లకోసం శ్వాశ్వత స్థలం కేటాయించి ఆదుకోవాలని వారు వేడుకున్నారు.
• ఆంధ్రప్రదేశ్ రిటైర్డ్ వీఏఓ ఫెడరేషన్ లో సుమారు 5 వేల మంది సభ్యులు ఉన్నారని.. ప్రస్తుతం పొందుతున్న పింఛన్ రూ. 4000 అని దాన్ని రూ. 10 వేలకు పెంచుతామని గతంలో టీడీపీ ప్రభుత్వం మాట ఇచ్చిందని.. పదివేలకు పెంచి తమకు న్యాయం చేయాలని ఆ సంఘ సభ్యులు నేడు గ్రీవెన్స్ లో నేతలను కలిసి వినతి పత్రం అందించారు
• గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల రైతుగా తాము తీవ్రంగా నష్టపోయానని.. హెచ్ ఎల్ సీ కాలువకు నీరు వదలకపోవడంతో తాను లీజుకు తీసుకున్న జిల్లాలోని రెడ్డిపల్లి ఓపెన్ ఎయిర్ జైలు భూమిలో 24 లక్షలు పెట్టుబడి పెట్టగా బోర్లకు నీరు రాకపోవడంతో .. ఒక్క రూపాయి చేతికి రాకపోగా.. మరో 29 లక్షల వరకు కౌలు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చిందని… రెండు సంవత్సరాలు కౌలు సక్రమంగానే చెల్లాంచానని… దయచేసి కౌలు రద్దు చేసి సాయం చేయాలని అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం నీలంపల్లి గ్రామానికి చెందిన నారిసిన్ని సాంబశివారెడ్డి నేతల ముందు గ్రీవెన్స్ లో అభ్యర్థించాడు.
• అక్రమంగా తాటిచెట్లు నరికారని పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేస్తే.. ఇంటిపైకి దాడికి వచ్చి తమ పొలం లాక్కున్నారని.. దీనిపై కలెక్టర్, ఎమ్మార్వోలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని దయ ఉంచి తనకు న్యాయం చేయాలని అనంతపురం జిల్లా పమిడి మండలానికి చెందిన శివశంకర్ వేడుకున్నారు.
• గత ప్రభుత్వంలో రజకులకు తీవ్ర అన్యాయం జరిగిందని.. పేరుకు కార్పొరేషన్ పెట్టి రూపాయి ఇవ్వలేదని.. కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు కార్పొరేషన్ ద్వారా 3 లక్షలు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని.. 50 ఏళ్ళ వయస్సు దాటిన వారికి పింఛన్లు మంజూరు చేయాలని లాండ్రీ షాపులకు సబ్సిడీలో కరెంట్ అందించాలని కడప జిల్లా రజక సంఘ సంభ్యులు గ్రీవెన్స్ లో వేడుకున్నారు.
వీటితో పాటు పలువురు సీఎంఆర్ ఎఫ్ సహాయానికి అర్థించగా.. మరికొందరు నిరుద్యోగులు ఉద్యోగాలకు అర్జీలు అందించారు.. పలువురు అధికారులపై ఫిర్యాదు చేస్తూ.. సర్టిఫికేట్లు ఇవ్వకుండా ఆఫీసుల చూట్టూ తిప్పుకుంటున్నారని.. అన్ని సక్రమంగా ఉన్నా.. కావాలని ఆఫీసుల్లో కూర్చోబెడుతు పనులు చేయకుండా కొందరు అధికారులు ఇబ్బంది పెడుతున్నారని.. నేడు గ్రీవెన్స్ కు వచ్చిన అర్జీదారులు నేతలకు ఫిర్యాదు చేశారు.