రాష్ట్రానికి నాలుగు మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబులు
నేడు వర్చువల్ గా ప్రారంభించనున్న ప్రధాని మోడీ
రూ.233 కోట్లతో 9 సిసిబిలకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని
మంగళగిరి ఎయిమ్స్ లో ఏర్పాట్లను సమీక్షించిన వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సియస్ ఎం.టి.కృష్ణ బాబు
అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనానంతరం విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంజూరైన నాలుగు సంచార ఆహార భద్రతా పరీక్షా ప్రయోగశాలలను ఆదివారం నాడు రాజ్ కోట్ నుండి వర్చువల్ గా జరిగే కార్యక్రమంలో ప్రధాని శ్రీ నరేంద్రమోడీ ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. రాష్ట్ర విభజన వరాలలో భాగంగా 2014లో ఈ ప్రయోగశాలలు రాష్ట్రానికి మంజూరయినప్పటికీ అవి 2023 నవంబర్ నాటికి కానీ పూర్తి స్థాయిని సంతరించుకోలేదు.
ఈ సంచార ప్రయోగశాలల ఏర్పాటుకు సంబంధించిన నిర్వహణా వ్యయాన్ని 60:40 నిష్పత్తిలో భరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం, భారత ఆహార భద్రతా ప్రమాణాల పరిరక్షణా సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఎఐ)తో అవగాహహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ మేరకు 60:40 నిష్పత్తిలో తన వంతు రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వాహనాలను కొనుగోలు చేసింది. ఈ సంచార ప్రయోగశాలలో ఆహార భద్రతా ప్రమాణాలకు సంబంధించి ఆహార కాలుష్యాన్ని గుర్తించేందుకు దాదాపు 80 రకాల పరీక్షలు చేస్తారు.
డయేరియా ప్రబలటం, ఆహార కాలుష్యం వంటి ఘటనలు జరిగినపుడు ఈ సంచార ప్రయోగశాలల ఆవశ్యకత ఎంతగానో ఉంటుంది. ఆరు చక్రాల వాహనంలో ఏర్పాటు చేసిన ఈ ప్రయోగశాల ద్వారా సేవల్ని మారుమూల గిరిజన ప్రాంతాలకు సైతం అందించే వీలు కలుగుతుంది. వంట నూనెల్లో వుండే ఫ్రీ రాడికల్స్ ను గుర్తించేందుకు ఈ వాహనాలలో టిపిసి(టోటల్ పోలార్ కాంపౌండ్) మీటర్ ను ఏర్పాటు చేశారు. వివిధ రకాలైన ఆహార పదార్ధాలలో కల్తీని గుర్తించేందుకు వీలుగా ఒక మ్యాజిక్ బాక్స్ పరికరాన్ని కూడా ఇందులో పొందుపర్చారు.
దేశవ్యాప్తంగా ఆహార భ్రదత విషయంలో ప్రజలను చైతన్య పరిచేందుకు ఈ సంచరా ప్రయోగశాలలను విస్తృతంగా వినియోగించనున్నారు. అందువల్ల నేటి నుండి అందుబాటులోకి వస్తున్న రాష్ట్ర ఆహార భ్రదతా విభాగానికి సంబంధించిన నాలుగు సంచార ప్రయోగశాలలు ఆహార భద్రతపై ప్రజలలో చైతన్ కలిగించటంతో పాటు ఆహార భద్రతా ప్రమాణాలకు సంబంధించి సంబంధిత వ్యాపారులకు అవగాహన కలిగించేందుకు సహకరిస్తాయని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మరియు స్టేట్ ఫుడ్ సేఫ్టీ కమీషనర్ జె.నివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.
విశాఖలో మైక్రోబయాలజీ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్
విశాఖపట్నంలో వున్న ప్రాంతీయ ఆహార భద్రతా ప్రయోగశాలను బలోపేతం చేసే చర్యల్లో భాగంగా 100 శాతం కేంద్ర నిధులతో ఏర్పాటు చేసిన కీలక మైక్రో బయాలజీ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ ను ఆదివారం నాడు ప్రధాని నరేంద్రమోడీ జాతికి అంకితం చేయనున్నారు. అత్యాధునిక యంత్రపరికరాలతో కూడిన ఈ ల్యాబ్ ఏర్పాటు కోసం ఎఫ్ఎస్ఎస్ఎఐ రు.4.77 కోట్లను మంజూరు చేసింది. ఏడాదికి 15వేలకు పైగా ఆహార పరీక్షలు నిర్వహించే సామర్ధ్యం ఈ ల్యాబ్ సొంతం.
9 క్రిటికల్ కేర్ బ్లాకులకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోడీ
క్రిటికల్ కేర్ సర్వీసెస్లో అత్యవసర శస్త్రచికిత్స మరియు ఇంటెన్సివ్ కేర్ ఉంటాయి. నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ (ఎన్ఎస్ఎస్ఓ) / నేషనల్ హెల్త్ అథారిటీ (ఎన్ హెచ్ఎ) ప్రకారం, సెకండరీ కేర్ మరియు రిఫరల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్లకు పరిమిత యాక్సెస్తో చాలా క్లిష్టమైన సంరక్షణ సేవలు ఇప్పటి వరకూ మూడవ శ్రేణి సంరక్షణ స్థాయికి పరిమితం చేయబడ్డాయి. కోవిడ్ మహమ్మారి తరువాత ఆరోగ్య వ్యవస్థల ప్రతిస్పందనను బలోపేతం చేయవలసిన అవసరాన్ని మరియు తగిన మౌలిక సదుపాయాల లభ్యతను ప్రభుత్వం మరింత గుర్తించింది.
రూ.233 కోట్లతో 9 సిసిబిల నిర్మాణం
కడప జిల్లా, కడప ప్రభుత్వ వైద్య కళాశాల (రు.23.75 కోట్లు), నెల్లూరు జిల్లా నెల్లూరు ఎసిఎస్ఆర్ ప్రభుత్వ వైద్య కళాశాల (రు.23.75 కోట్లు), శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం ప్రభుత్వ వైద్య కళాశాల (రు.23.75 కోట్లు), తిరుపతి జిల్లా, తిరుపతి శ్రీ వేంకటేశ్వర మెడికల్ కళాశాల(రు.23.75 కోట్లు), తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాల (రు.23.75 కోట్లు), కర్నూలు జిల్లా కర్నూలు ప్రభుత్వ వైద్య కళాశాల(రు.23.75 కోట్లు), విజయనగరం జిల్లా, విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాల (రు.23.75 కోట్లు), గుంటూరు జిల్లా,తెనాలి జిల్లా ఆసుపత్రి (రు.44.50 కోట్లు), శ్రీ సత్యసాయి జిల్లా, హిందూపూర్ జిల్లా ఆసుపత్రి (రు.22.45 కోట్లు) మొత్తం 233 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మితమయ్యే 9 సిసిబిల నిర్మాణ పనులకు ప్రధాని నరేంద్రమోడీ నేడు శంకుస్థాపన చేయనున్నారు.