– ప్రజలను అప్రమత్తం చేసిన ఎమ్మెల్యే చింతమనేని
దెందులూరు, మహానాడు: అర్థరాత్రి వేళ రామిలేరు వరద ముంచెత్తింది. ముంచుకొస్తున్న వరద నుంచి ప్రజలను కాపాడటానికి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వేకువజామున రెండు గంటలకు స్వయంగా రంగంలోకి దిగారు. ‘అమ్మా వరద వచ్చేస్తుంది… నిద్ర లేవండి… నేను పడవలు తెప్పిస్తాను… ఈలోపు డాబాల పైకి వెళ్ళండి’ అంటూ రామిలేరువాగు వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను స్వయంగా అప్రమత్తం చేశారు.
తాళ్ళమూడి సహా పలు గ్రామాల్లోని జనావాస ప్రాంతాల్లోకి వరద నీరు ముంచెత్తుతుండటంతో నిద్ర మత్తులో ఉన్న ప్రజలను వరద గురించి హెచ్చరించారు. ఎమ్మెల్యే చింతమనేని హెచ్చరికలతో అప్రమత్తమై ప్రజలు తమ ఇంటి డాబా లపైకి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఏలూరు కలెక్టర్ వెట్రీ సెల్వీ తో ఫోన్లో మాట్లాడిన ఎమ్మెల్యే రామిలేరు వాగు వరద తీవ్రతను వివరించారు. ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం కలగకుండా తక్షణమే అన్ని రకాల చర్యలు చేపట్టాలని, దిగువన ఉన్న లాకులు తెరవటం వంటి సత్వర చర్యల ద్వారా వరద ప్రవాహ తీవ్రతను జనావాసాల వైపు తగ్గించేలా చర్యలు చేపట్టాలని, పడవల ద్వారా లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేలా తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆదేశాలతో రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి.