Mahanaadu-Logo-PNG-Large

కౌంటింగ్‌పై ఎంపీ అభ్యర్థులకు రేవంత్‌రెడ్డి సూచనలు

-నిర్లక్ష్యం వద్దు…అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలి
-నిబద్ధత ఉన్న వారినే ఏజెంట్‌గా పంపాలి
-ఈవీఎం, 17సీ ఓట్లకు తేడా వస్తే ఫిర్యాదు చేయాలి

హైదరాబాద్‌: పార్లమెంట్‌ అభ్యర్థులు, ఇన్‌చార్జ్‌ మంత్రులు, ఏఐసీసీ సెక్రటరీలతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం జూమ్‌ సమావేశంలో సమీక్షించారు. ఏఐసీసీ ఇన్‌చార్జ్‌ దీపాదాస్‌ మున్షీ, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌కుమార్‌ గౌడ్‌, మంత్రులు, ఏఐసీసీ సెక్రటరీలు, ఎంపీ అభ్యర్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కౌంటింగ్‌ సందర్భంగా పలు సూచనలిచ్చారు. కౌంటింగ్‌ సమయంలో అభ్య ర్థులు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని, పోటాపోటీ ఉన్న నియోజకవర్గాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని తెలిపారు. పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు పూర్తయ్యాకే ఈవీఎం కౌంటింగ్‌ జరుగుతుందన్న విషయాన్ని అందరూ గుర్తించుకోవాలని సూచించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చిత్తశుద్ధి, నిబద్ధత ఉన్నవారిని మాత్రమే ఏజెంట్‌గా పంపాలని, సీనియర్‌ నాయకులను కూడా కౌంటింగ్‌ సెంటర్లకు తీసుకెళ్లేలా చూసుకోవాలని తెలిపారు. ప్రతి రౌండ్‌లో కౌంటింగ్‌ విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ప్రతిఒక్కరి దగ్గర 17సీ లిస్ట్‌ ఉండేలా చూసుకోవాలని పేర్కొన్నారు. ఈవీఎం ఓట్లకు, 17సీ లిస్ట్‌ ఓట్లకు తేడా వస్తే అక్కడే ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయాలని, ప్రతి అభ్యర్థి వీటిపై అవగాహనతో ఉండాలని చెప్పారు.