చంద్రబాబు డైరెక్షన్‌లోనే రేవంత్‌రెడ్డి కుట్రలు

ఏడు మండలాల విలీనంపై ఎందుకు మాట్లాడరు
చిత్తశుద్ధి ఉంటే ఐదు గ్రామాలను తెలంగాణలో కలపాలి
రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తే ఊరుకోం
పౌరసరఫరా కుంభకోణంలో సీఎం పాత్ర ఉంది

బీఆర్‌ఎస్‌ నేతలు బాల్క సుమన్‌, పెద్ది సుదర్శన్‌రెడ్డి

హైదరాబాద్‌: మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్‌, పెద్ది సుదర్శన్‌ రెడ్డి బుధవారం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. బాల్క సుమన్‌ మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను అంధ్రాలో కలిపితేనే ప్రమాణ స్వీకారం చేస్తానని మోదీకి చెప్పానని చంద్రబాబు ఎన్డీఏ ఎమ్మెల్యేల సమావేశంలో చెప్పారు. అప్పట్లో ఏడు మండలాలను ఆంధ్రాలో కలపడంపై తెలంగాణ బంద్‌కు బీఆర్‌ఎస్‌ పిలుపునిచ్చి పార్లమెంటులో ఎంపీలు కొట్లాడారు. లోయర్‌ సీలేరు పవర్‌ ప్రాజెక్టు కూడా ఆంధ్రాకు వెళ్లింది. చంద్రబాబు శిష్యుడు రేవంత్‌ రెడ్డి సీఎంగా ఉండి ఏడు మండలాలపై ఒక్క మాట ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు డైరెక్షన్‌లోనే రేవంత్‌ నడుస్తున్నారని పేర్కొన్నా రు. పది సంవత్సరాల తర్వాత తెలంగాణపై చంద్రబాబు, రేవంత్‌ రెడ్డి కలిసి కుట్రలు మొదలుపెట్టారని మండిపడ్డారు. చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్‌ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా భద్రాచలం రూరల్‌ మండలంలోని యటపాక, కన్నాయిగూడెం, పురుషోత్తపట్నం, గుండాల, పిచ్చుకలపాడు పంచాయతీలను తెలంగాణలో కలిపే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

కమీషన్ల ప్రభుత్వం

రాష్ట్రంలో కరెంటు కోతలు నడుస్తున్నాయి. రైతులకు విత్తనాలు సరిగా అందించడం లేదు. ఏపీలో పనిచేసిన ఆదిత్యానాథ్‌ నియామకాన్ని వెంటనే రద్దు చేయాలని, తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. కాంగ్రెస్‌ అంటేనే కమీషన్ల ప్రభుత్వమని ధ్వజమెత్తారు. బీఆర్‌ ఎస్‌పై, కేసీఆర్‌పై కమీషన్లు వేస్తూ కాంగ్రెస్‌ మంత్రులు కమీషన్లు తీసుకుంటున్నారు. సింగరేణి బొగ్గు గనులను సింగరేణి సంస్థకు కేటాయించాలని కిషన్‌రెడ్డిని డిమాండ్‌ చేశారు. బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం పనిచేయాలని కోరారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు బయ్యారం ఉక్కు పరిశ్రమ, ఐటీఐఆర్‌ను తెలంగాణకు ఇవ్వాలని కోరారు. తెలంగాణ సమస్యల కోసం కాంగ్రెస్‌ ఎంపీలు పార్లమెంటులో మాట్లాడాలని డిమాండ్‌ చేశారు.

పౌరసరఫరా కుంభకోణంలో రేవంత్‌ పాత్ర

పెద్ది సుదర్శన్‌ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సివిల్‌ సప్లయీస్‌లో జరిగిన కుంభకోణంపై ప్రభుత్వం స్పందించడం లేదని, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేవన్నారు. రైస్‌ టెండర్లు, ప్యాడీ టెండర్లు రద్దు అయ్యాయా లేదా? సీఎం రేవంత్‌ రెడ్డి పౌర సరఫరాల శాఖపై ఎందుకు ఎందుకు సమీక్షించడం లేదు? అని ప్రశ్నించారు. సివిల్‌ సప్లై కమిషనర్‌ అందుబాటులో ఉండటం లేదని, మా దగ్గర ఉన్న ప్యాడీని లిఫ్ట్‌ చేయాలని రైస్‌ మిల్లర్లు జిల్లా కలెక్టర్లకు లేఖలు ఇచ్చారన్నారు. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు రైస్‌ మిల్లర్ల దగ్గర డబ్బులు మాత్రమే అడుగుతున్నారని తెలిపారు. పౌర సరఫరా కుంభకోణంలో సీఎం రేవంత్‌ రెడ్డి పాత్ర ఉందని, త్వరలోనే పౌరసరఫరా భవన్‌ను ముట్టడిస్తామని స్పష్టం చేశారు.