సకాలంలో మండల కేంద్రాలకు స్కూల్‌ బ్యాగులు

-250 ట్రక్కుల్లో ఫ్యాక్టరీల నుంచి స్టాక్‌
-అంతరాష్ట్ర సరిహద్దుల్లో రాకపోకలకు ప్రణాళిక
-పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ ప్రకాష్‌

విజయవాడ, మహానాడు: రాష్ట్రంలోని మండల కేంద్రాలకు స్కూల్‌ బ్యాగ్‌లను సకాలంలో చేర్చడానికి చర్యలు తీసుకుంటున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ ప్రకాష్‌ తెలిపా రు. దేశవ్యాప్తంగా సాధారణ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అంతరాష్ట్రాల మధ్య రాకపోకల విషయంలో ఆంక్షలు ఉన్నాయని, ఎన్నికల నిబంధనలు అతిక్రమించకుండా స్కూల్‌ బ్యాగ్‌లు తయారయ్యే ఫ్యాక్టరీ నుంచి ట్రక్కుల ద్వారా రాష్ట్రం లోని మండల కేంద్రాలకు వాటిని తరలించే ప్రక్రియ సవాళ్లతో కూడుకున్నదన్నారు.

అంతర్రాష్ట్రాలు దాటి వచ్చే విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుం డా 250 ట్రక్కుల ద్వారా స్కూల్‌ బ్యాగ్‌లను రాష్ట్రానికి తరలించడానికి ప్రణాళిక రూపొందించామన్నారు. అంతర్రాష్ట్రాలు సరిహద్దులను దాటేటప్పుడు ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి ప్రతి ట్రక్కు డ్రైవర్‌కు ఒక అండర్‌ టేకింగ్‌ ఇవ్వడం జరిగిందన్నారు. ప్రతి చెక్‌పోస్ట్‌లో డ్రైవర్లు అండర్‌ టేకింగ్‌ చూపించడం ద్వారా స్టాక్‌ రాష్ట్ర ప్రభుత్వానికి చెందినదని స్పష్టం చేసి గమ్యస్థానాలను చేర్చేందుకు చర్య లు తీసుకుంటున్నామన్నారు. నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు.