తాడేపల్లి, మహానాడు: విజయనగరం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పల నాయుడు పేరును మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్.జగన్ ప్రకటించారు. పార్టీ నాయకులతో సమావేశమైన జగన్, వారందిరి అభిప్రాయాలను తీసుకున్నారు. పార్టీ నాయకులు వ్యక్తంచేసిన ఏకాభిప్రాయం మేరకు అప్పలనాయుడు పేరును ప్రకటిస్తున్నట్టు వైయస్ జగన్ వెల్లడించారు.
విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ తూర్పుకాపు సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత బొత్సకు అవకాశం ఇచ్చిన దృష్ట్యా, ఈసారి వెలమ సామాజిక వర్గానికి చెందిన అప్పలనాయుడు పేరును పార్టీ నేతలంతా బలపరిచినందున ఈ నిర్ణయం తీసుకున్నామని జగన్ తెలిపారు. అనుభవం, సామాజిక వర్గం రీత్యా అప్పలనాయుడు పేరును ప్రకటించామన్నారు. అప్పలనాయుడు అనుభవజ్క్షడు, సీనియర్ అయినందున అందరి గౌరవాన్ని పొందుతారన్నారు. సమిష్టి కృషితో విశాఖపట్నం ఎమ్మెల్సీ స్థానాన్ని చేజిక్కించుకున్నామని, విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీని కూడా అదే స్ఫూర్తితో గెలుచుకోవాలని పార్టీనేతలకు జగన్ పిలుపునిచ్చారు.
విజయనగరం జిల్లాల్లో స్థానిక సంస్థలకు చెందిన మొత్తం ప్రతినిధుల సంఖ్య 753 అని, ఇందులో 592 మంది వైయస్సార్సీపీ స్థానిక సంస్థల ప్రతినిధులుగా గెలుపొందిన వారు ఉన్నారు. పార్టీ అభ్యర్థి చినఅప్పలనాయుడు సుమారు నాలుగు దశాబ్దాలుగా ప్రజాజీవితంలో కొనసాగుతున్నారు. బొబ్బిలి నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన శంబంగి వెంకట చినఅప్పలనాయుడు 2019లో ప్రొటెం స్పీకర్గా పనిచేశారు.