-సీఈసీకి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ
-సీఎఫ్ఎంఎస్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ఫిర్యాదు
అమరావతి: తమ అనుంగ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకు ఇష్టానుసారం అప్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సోమవారం సీఈసీకి లేఖ రాశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వివరించారు. అప్పులపై కేంద్ర ప్రభుత్వం విధించిన ఎఫ్ఆర్బీఎం పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం జూన్ 1వ తేదీకే దాటివేసింది. ఈ ఏడాది చేసిన అప్పుల్లో ఎక్కువ శాతం అప్పులు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాతే చేశారు. చేసిన అప్పులను బినామీ కాంట్రాక్టర్లకు, కంపెనీలకు బిల్లుల రూపంలో చెల్లించి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు.
ఆర్బీఐ ప్రకటన ఆధారంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.4 వేల కోట్ల అప్పులకు దరఖాస్తు చేసింది. ముందు బిల్లులు ముందే చెల్లించాలన్న సీఎఫ్ఎంఎస్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఇప్పుడు తెస్తున్న రూ.4 వేల కోట్లు అప్పులు సైతం కాంట్రాక్టర్లకు చెల్లించాలని చూస్తున్నారు. జూన్ 4న ఎన్నికల ఫలితాల రానున్న నేపథ్యంలో అధికారం కోల్పోతున్న ప్రభుత్వం ఇంత పెద్ద మొత్తంలో అప్పులు చేయడం రాజ్యాంగ విరుద్ధం. కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే వరకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఎటువంటి అప్పులు చేయకుండా, చెల్లింపులు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలి. ఇష్టానుసారం అప్పులు చేసేందుకు సహకరిస్తూ.. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న అధికారులపై సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.