టీడీపీ శ్రేణులు పోలీసుశాఖకు సహకరించాలి

వైసీపీ వారు రెచ్చగొట్టినా సమన్వయం పాటించండి
గురజాల టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు

గురజాల: నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అభిమానులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖకు సహకరించాలని గురజాల టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు కోరారు. ఐదేళ్ల వైసీపీ అరాచక ప్రభుత్వానికి జూన్‌ 4తో తెరపడుతుందన్నారు. అరాచకానికి అడ్డుకట్ట వేసి అభివృద్ధితో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. తెలుగుదేశం పార్టీకి ఓటు వేసిన అందరి మనోభావాలను దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గాన్ని ముందుకు నడిపిస్తాం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తల త్యాగాన్ని, కష్టాన్ని గుర్తించి న్యాయం చేస్తామని తెలిపారు. వైసీపీ వాళ్లు రెచ్చగొట్టినా శాంతి యుతంగా సమన్వయం పాటించి ఎటువంటి అల్లర్లకు దిగవద్దని, వచ్చే మన ప్రభుత్వంలో జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకుని చట్టపరంగా కూడా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు.